అంతర్వేదిలో ఏపీ మంత్రులకు చుక్కెదురు, అడ్డుకున్న వీహెచ్పీ, బజరంగ్ దళ్..తోపులాట
అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం కావడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. రథం దగ్ధమైన అంతర్వేదికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెళ్లగా.. నిరసన సెగ తగిలింది. మంత్రుల పర్యటన సమాచారంతో.. తిరిగి వస్తోన్న క్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రథం దగ్ధమయిన ఘటనలో కుట్రకోణం ఉంది అని మండిపడ్డారు. వీహెచ్పీ, బజరంగ్ దళ్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట
ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. హిందూ సంఘాల కార్యకర్తల నిరసనలతో ఆ ప్రాంతం నినాదాలతో మారుమోగింది. పరిస్థితి చేయి దాటిపోతుంని గ్రహించిన పోలీసులు.. మంత్రులను తిరిగి ఆలయంలోకి తీసుకొచ్చారు. దీంతో వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాడి మరీ నిరసనకారులు వచ్చారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులకు తలప్రాణం తోకకొచ్చింది.
రథం కాలిపోయిన ప్రాంగణం పరిశీలన
అంతకుముందు ఆలయ ఆవరణలో రథం కాలిపోయిన ప్రాంతాన్ని మంత్రులు పరిశీలించారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారిస్తామని పేర్కొన్నారు. నిందితులను వదిలిపెట్టబోని తేల్చిచెప్పారు. వచ్చే కల్యాణ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున కొత్త రథాన్ని తయారు చేయిస్తామని తెలిపారు.
Recommended Video
చర్యలు తప్పవు
రథం దగ్ధం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇదీ ఎవరో కావాలని చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ అయితే ఏకంగా కమిటీ వేయగా.. బీజేపీ సిట్టింగ్ జడ్జీతో విచారణకు డిమాండ్ చేసింది. ప్రభుత్వం కూడా బాధ్యులను ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది.