ఫోన్ రీఛార్జీ డబ్బు ఇవ్వలేదని యువతి పెళ్లి రద్దయ్యేలా చేశాడు
నగర శివారులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతి అమెరికా అబ్బాయిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.
వరంగల్: నగర శివారులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతి అమెరికా అబ్బాయిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. వచ్చే నెలలో పెళ్లి కావాల్సి ఉంది. ఈమెకు గతంలో తనతోపాటు కళాశాలలో చదువుకున్న హన్మకొండ రెవెన్యూకాలనీకి చెందిన అరవింద్ రెడ్డి అనే యువకుడితో పరిచయముంది.
ఇటీవల ఆమెకు వివాహం కుదిరిందని తెలుసుకున్న ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. కళాశాలలో చదువుకుంటున్న సమయంలో ఫోన్ మాట్లాడినందుకు రూ. 20 వేల ఖర్చు వచ్చింది... ఆ డబ్బులు ఇవ్వాలని, లేకుంటే కాబోయే భర్తకు చెడుగా చెబుతానని బెదిరించాడు.
ఆ యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వారు మందలించి వదిలేశారు. కాగా, అరవింద్రెడ్డి అక్కడితో ఆగకుండా అమ్మాయికి కాబోయే భర్త నెంబర్ సేకరించి, అతనికి ఫోన్ చేసి ఆమె గురించి చెడుగా చెప్పాడు. దీంతో అతను పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు యువతి తల్లిదండ్రులకు చెప్పాడు.
వివాహం రద్దుకు కారణమైన అరవింద్రెడ్డిపై యువతి కుటుంబ సభ్యులు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై గండ్రాతి సతీష్ను వివరణ కోరగా విచారణ చేస్తున్నామని చెప్పారు.