లక్ష్మణ్, డీకే అరుణ..ఇలా అధ్యక్ష రేసులో ఉన్నవారికి షాక్ ఇచ్చిన బీజేపీ: రీజన్ ఇదే !!
తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులు కావటం సీనియర్ నాయకులు, అధ్యక్ష పదవిని ఆశించి భంగపడిన నాయకులకు ఏ మాత్రం డైజెస్ట్ కావటం లేదు .బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటించటంతో అటు నిన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ తో పాటు డీకే అరుణ , జితేందర్ రెడ్డి తదితరులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ అధ్యక్షా రేసులో హేమాహేమీలు
నిన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ కొనసాగిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారని వార్తలు వస్తున్న క్రమంలో అధ్యక్ష స్థానం కోసం పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. హేమాహేమీలే తలపడ్డారు . ఇందులో భాగంగా పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. తాజా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు , డీకే అరుణ, జితేందర్ రెడ్డి పేర్లు పరిశీలించిన బీజేపీ జాతీయ నాయకత్వం బండి సంజయ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. యువ నేతకు పట్టం కట్టారు.
నిర్ణయాలు తీసుకోవటంలో లేట్ ... ప్రభావం లేదనే భావనతో లక్ష్మణ్ కు నో చాన్స్
బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరు అయితే బాగుంటుంది అన్న అంశంపై పార్టీ అధిష్ఠానం నుంచి పరిశీలకులు అనీల్ జైన్ తదితరులు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈసారి కూడా లక్ష్మణ్నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న ప్రచారమూ సాగింది. కానీ లక్ష్మణ్ ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకోకపోవటం , పార్టీని బలోపేతం చెయ్యటంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోవటం వంటి కారణాలు లక్ష్మణ్ కు మైనస్ అయ్యాయి. ఇక డీకే అరుణ మహిళా కోటాలో ఈ సారి ఆమెకే అధ్యక్ష పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆమెకు హైకమాండ్ షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్ నుండి రావటం.. పార్టీలో వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో అరుణకు షాక్
అందుకు కారణం లేకపోలేదు .డీకే అరుణ మొదట నుండి బీజేపీలో లేకపోవటం , ఆమె కాంగ్రెస్ నుండి వచ్చిన నేత కావటం , డీకే అరుణలకు పార్టీలో సీనియారిటీ లేకపోవడం,ఒకవేళ ఆమెకు అధ్యక్ష పదవి ఇస్తే మిగిలిన సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో ఆమె పేరు పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇక జితేందర్ రెడ్డి , అలాగే ధర్మపురి అరవింద్ విషయంలో కూడా ఇదే అభిప్రాయం ఉండటంతో వారికి అవకాశం ఇవ్వలేదు .
Recommended Video
పలు సమీకరణాలు , రాష్ట్ర పరిస్థితుల నేపధ్యంలో బండికి ఛాన్స్
బండి సంజయ్ ఏబీవీబీ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టటం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటం , ప్రస్తుతం టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే దూకుడు ఉన్న నేపధ్యంలో బండి సంజయ్ కు బీజేపీ బాధ్యతలు అప్పగించింది. ఏదిఏమైనా బీజేపీ హైకమాండ్ చాలా సమీకరణాలను లెక్కించి మరీ బండి సంజయ్ కు అధ్యక్షా బాధ్యత అప్పగించింది. నిన్నటి దాకా తమకే అవకాశం వస్తుందనుకున్న నేతలకు వివిధ కారణాలతో అవకాశం ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి , లక్ష్మణ్ వంటి నేతలను నిరాశలో ముంచింది.