తెలంగాణాలో కేసీఆర్ అవినీతిపై నడ్డా వ్యాఖ్యలు; కేంద్రం ఫోకస్ చేస్తుందా? కొత్త చర్చ!!
బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది బీజేపీ . అందులో భాగంగానే నిన్న జేపీ నడ్డా పర్యటన కొనసాగింది అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. నడ్డా తర్వాత అమిత్ షా రాకపైన రాజకీయ వర్గాలలోనూ ఆసక్తి నెలకొంది. ఇక నడ్డా చేసిన కెసీఆర్ సర్కార్ పై అవినీతి వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తుంది.
తెలంగాణా పై పట్టు కోసం బీజేపీ వ్యూహం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కెసిఆర్ సర్కార్ కు చరమగీతం పాడి అధికారం చేజిక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా అగ్ర నేతలు సైతం రంగంలోకి దిగి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా పాలమూరు జిల్లాకు వచ్చిన జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ పై పట్టు సాధించడం కోసం బిజెపి పడుతున్న కష్టాన్ని కళ్లకు కడుతుంది. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న జేపీ నడ్డా జనం గోస.. బిజెపి భరోసా సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అవినీతిలో తెలంగాణ సర్కార్ అగ్రస్థానంలో.. ఎటాక్ చేసిన నడ్డా
తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారని, తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కారును తీసుకువస్తామని వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలను గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని జేపీ నడ్డా వ్యాఖ్యలు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కి ఏటీఎం గా మారిందని విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ లో కూడా అవినీతికి పాల్పడ్డారంటూ జేపీ నడ్డా సంచలన ఆరోపణలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ బ్రష్టు పట్టిస్తున్నారని, అవినీతిలో తెలంగాణ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు. నడ్డా వ్యాఖ్యలతో కేంద్రం కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై ఫోకస్ చేస్తుందా అన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతుంది.
ఏపీలో సీబీఐతో దాడులు చేయించిన విధంగా తెలంగాణాలోనూ ప్లాన్ చేస్తారా?
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ కుటుంబ పాలన పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కేంద్రం రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతిపై ఫోకస్ చేస్తే కెసీఆర్ ఇబ్బంది పడతారని చర్చ జరుగుతుంది. గత ఎన్నికలకు ముందు ఏపీలో సీబీఐతో దాడులు చేయించిన విధంగా తెలంగాణాలోనూ ప్లాన్ చేస్తారా అన్న చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం, బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజా అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడగా,ఈ నెలలోనే అమిత్ షా పర్యటన కూడా కొనసాగనుంది. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేసీఆర్ సర్కార్ ను ఎలా టార్గెట్ చేస్తారో అన్న చర్చ జరుగుతుంది.
అగ్రనాయకుల పర్యటనతో తెలంగాణాలో బీజేపీకి మైలేజ్
మే 14వ తేదీన అమిత్ షా రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో నిర్వహించే రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల బ్రతుకులు బాగుపడతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అగ్రనాయకులు పర్యటనను తెలంగాణ బీజేపీ తన మైలేజ్ కోసం వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఎవరు సక్సెస్ అవుతారో ?
ఏది ఏమైనా ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా నేతలు అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో పాటుగా, కేంద్రంలోని అగ్రనేతలను రంగంలోకి దింపి ఇప్పటినుండే వచ్చే ఎన్నికల రాజకీయాలతో సెగలు పుట్టిస్తున్నారు. మరి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్న ఈ పోరాటంలో వచ్చే ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి కెసీఆర్ పై ఒత్తిడి పెంచుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పోరులో ఎవరు ఏ మేరకు సక్సెస్ అవుతారో భవిష్యత్తులో తెలియనుంది.