సరూర్ నగర్ సభలో రేసుగుర్రంలా రెచ్చి పోయిన రేవంత్ రెడ్డి..!!
రేవంత్ రెడ్డి కాంగ్రెసులోకి రాక ముందు కాంగ్కెస్ వ్యవహారం ఉప్పులేని సాంబార్ లా ఉండేది. కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుల్లో ' ఫైర్' లేక ఢీలా పడిపోయేపరిస్థితిలో ఉండేది పార్టీ. కేసీఆర్ సందర్భం వచ్చినపుడల్లా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను 'ఫుట్ బాల్' ఆడుకుంటుంటే చేష్టలుడిగి చూస్తారు తప్ప ప్రతిస్పందన ఉండదు. టిఆర్ఎస్ నాయకత్వం ప్రతిపక్షాలను 'బుల్ డోజ్' చేస్తుంటే, అందుకు ధీటుగా అధికారపక్షం పై ఎదురు దాడి చేసే వారు కురువయ్యారు.
కెసీఆర్ టీమ్ పై చెదురుమదురుగా విమర్శలు చేయడం మినహా వాటిలో సరైన మసాలా ఉండదు. టిఆర్ఎస్ వేగాన్ని కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం అందుకోలేకపోతుందన్న తరుణంలో కేసీఆర్ పై దూకుడుగా విరుచుకుపడే ఓ గొంతు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి లభించింది. అదికార పార్టీ పై రేవంత్ రెడ్డి అటాక్ చేసే తీరు యూత్ కు బాగా కనెక్టు అయ్యింది. సరూర్ నగర్ నిరుద్యోగ గర్జనలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఏ రేంజ్ లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
రేవంత్ పేరు అనౌన్స్ చేయగానే ఆకాశాన్నంటిన ఈలలు, చప్పట్లు, కేరింతలు..
ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీకి ప్రయాణించవలసిన విమాన సమయం ముంచుకొస్తున్నది. ఆయన సిబ్బంది ఆయనను అప్రమత్తం చేశారు. మరో వైపు కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ల ప్రసంగాలు కొలిక్కి రావడం లేదు. జనంలో హాహాకారాలు, నినాదాలు మిన్నంటుతున్నవి. జనం ఏమికోరుతున్నారో రాహుల్ గాంధీకి అర్ధం కావడం లేదు. జనం చేస్తున్న డిమాండ్ ను రాహుల్ దృష్టికి తీసుకుపోవడానికి వేదిక పై ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించలేదు. చివరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, రాహుల్ సెక్రెటరీ కొప్పుల రాజు కలుగజేసుకొని రాహుల్ గాందీకి విషయం చేరవేశారు. ‘రేవంత్ రెడ్డి మాట్లాడాలి' అంటూ జనం నుంచి నినాదాలు వస్తున్నాయని, మరీ ముఖ్యంగా యువత రేవంత్ ప్రసంగం కోసం పట్టుబడుతున్నారని రాహుల్ గాంధీకి తెలిపారు. రేవంత్ రెడ్డి ని మాట్లాడించవలసిందిగా కాంగ్రెస్ సీనియర్లను రాహుల్ ఆదేశించక తప్పలేదు. ఈ సన్నివేశాలు మంగళవారం సరూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో కనిపించినవి.
అయిస్టంగానే అనుమతిచ్చిన నేతలు.. ఇర్రగదీసిన రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి ఈ సభలో ప్రసంగించడం కాంగ్రెస్ లో తలపండిన నాయకులకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా, ఇతర టిఆర్ఎస్ మంత్రుల పైనా రేవంత్ రెడ్డి ఏ విధంగా చెలరేగిపోతారో, ఎంతలావిరుచుకుపడతారో సీనియర్లకు తెలుసు. వారు చాలా సార్లు రుచి చూశారు. రేవంత్ రెడ్డి ప్రాభవాన్ని కాంగ్రెస్ లో కుదించడమెలా? ఆయన ప్రాబల్యం పెరగకుండా ఏమి చేయాలి? కాంగ్రెస్ శ్రేణులలో ఆయన పట్టు పెంచుకోకుండా ఎలానియంత్రించాలి? ఆయన్ను ఎట్లా కట్టడి చేయాలి? ఆయన హవా ను ఎట్లానియంత్రించాలి? వంటి అంశాలు కాంగ్రెస్ సీనియర్లను వేధిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చీ రాగానే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ని చెండాడుతుండడం సీనియర్లకు ‘ఏ కారణంగానో' నచ్చడం లేదు. అచ్చం కేసీఆర్ లాగానే తెలంగాణ గ్రామీణ మాండలికంలో అధికార పార్టీని, ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారపడుతుండడంతో సహజంగానే కాంగ్రెస్ శ్రేణులకు ప్రాణం లేచి వస్తున్నది.
రాహుల్ జోక్యంతో మైక్.. మైండ్ బ్లాంక్ అయ్యే రీతిలో మాట్లాడిన రేవంత్..
రేవంత్ రెడ్డికి సరూర్ నగర్ సభలో అతి కష్టంమీద, అత్యంత ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య, రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్న తర్వాతా గానీ మాట్లాడే అవకాశం రాలేదు. రేవంత్ ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఏమి చెప్పారు అనే విషయాల కన్నా ఆయన ప్రసంగాన్ని ప్రజలు డిమాండ్ చేయడం, రేవంత్ మైకు చేబట్టగానే కేకలు, ఈలలు రావడం జనంలో ఇన్ స్టెంట్ స్పందనను వెల్లండించినట్లయింది. అప్పటికీ రేవంత్ రెడ్డి ప్రసంగం వైపు నుంచి రాహుల్ గాంధీ దృష్టి మరల్చే ప్రయత్నాలూ జరిగినవి. కొందరు రాహుల్ గాంధీ తో ఫోటోలు దిగేందుకు ప్రయతించడం, మరి కొందరు ఆయనకు ఎదో చెప్పేందుకు ప్రయత్నించడం జరిగినవి. రేవంత్ రెడ్డి ప్రసంగం వినడానికి రాహుల్ గాంధీ కూడా ఎందుకో అమితాసక్తి ప్రదర్శించారు. రేవంత్ ప్రసంగం నుంచి తన దృష్టి మళ్లించే చర్యలను అయన తుంచేశారు. అలాంటి వారిని ఆయనే స్వయంగా సున్నితంగా పక్కకు నెట్టవలసి వచ్చింది.
చివరి పంచ్ రేవంత్ రెడ్డిదైతే ఆ కిక్కే వేరబ్బా అంటున్న కాంగ్రెస్ శ్రేణులు..
రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిసీముగియగానే రాహుల్ గాంధీ చప్పట్లు కొడుతూ అభినందించడం విశేషం.‘ఇవాళ ఇక్కడ జనాన్ని చూస్తుంటే గండిపేట తెగి గల్లీల్లోకి వచ్చినట్లుంది. కేసీఆర్.. ఇది చాలా? ఇంకా కావాలా..! ఇంకా కావాలంటే సింగరేణిలో గర్జిస్తాం. కాకతీయ కోటలో కదం తొక్కుతాం. పరేడ్ గ్రౌండ్లో వరదై పారుతాం' అని రేవంత్ అన్నారు. "కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందని అడుగుతున్నారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్, శ్రీ రామ్ సాగర్, కల్వకుర్తి, బీమా నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను ఎవరు కట్టించారు? దేశంలోని మారుమూల గ్రామాలు, తండాలకు కూడా విద్యుత్ను అందించి చీకట్లను తొలగించిన పార్టీ కాంగ్రెస్" అని రేవంత్ రెడ్డి సరూర్ నగర్ సభలో గర్జించారు. రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. సోనియాను అమ్మానా.. బొమ్మనా అని తిట్టిన కేసీఆర్ని చూస్తూ ఊరుకుందామా? కదం తొక్కి ఖతంచేద్దామా?,అనిరేవంత్ ఉద్వేగంగా ప్రసంగించారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికి కార్యకర్తలు పెట్టిన కేరింతకు రాహుల్ గాందీ కూడా లయబద్దంగా తల ఊపక తప్పలేదు.