Telangana budget 2020: ఆదిలాబాద్ విమానాశ్రయం పై ఈ బడ్జెట్లో ప్రకటన ఉంటుందా..?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 6న తెలంగాణ సమావేశాలు ప్రారంభం కానుండగా మార్చి 8న బడ్జెట్ను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే పలు అంశాలు బడ్జెట్లో ప్రస్తావనకు వస్తాయా లేదా అనేదానిపై చర్చ జరుగుతోంది.
Recommended Video
ఆదిలాబాద్ కొత్తగూడెంలలో ఎయిర్పోర్ట్..?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ సారి ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్లో ఆదిలాబాద్ కొత్తగూడెంలలో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి అయి ఉంటే ఈ సమావేశాల్లోనే ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం విమానాశ్రయంకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగాన్ని నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
1600 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం
ఆదిలాబాద్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధీనంలో నడిచే ఎయిర్ఫోర్స్ స్టేషన్ కోసం భూసేకరణ జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితమే 1600ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. దీనిపై పూర్తి వివరాలను కోరింది ముఖ్యమంత్రి కార్యాలయం. అంతేకాదు 369 ఎకరాల్లో ఉన్న పాత ఏరోడ్రోమ్ను కూడా పూర్తి స్థాయి ఎయిర్ఫోర్స్ స్టేషన్గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అయితే ఆనాడు గుర్తించిన భూమి అలానే ఉందా లేక ఎవరైనా అక్రమంగా చొరబడ్డారా అనే అంశంపై కూడా దృష్టి సారించింది ప్రభుత్వం.
అన్నీ సవ్యంగా సాగితే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే...
ఇదిలా ఉంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్, కొత్తగూడెంలలో విమానాశ్రయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాలకు విమానాశ్రయాలను తీసుకురావాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో దీని సాధ్యసాధ్యాలపై వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ సవ్యంగా సాగితే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే విమానాశ్రయ ఏర్పాటుపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఎయిర్ఫోర్స్ స్టేషన్ ప్రతిపాదనకు భూసేకరణ జరిపేలా ప్రభుత్వం ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది . ఇదిలా ఉంటే ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం అంత ఆసక్తి చూపడం లేదని ఓ అధికారి చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు.
ఏటీఆర్ విమానాలను మాత్రేమే నడిపేందుకు సిద్ధం
గతేడాది ఆగష్టులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఓ బృందం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. ఖానాపూర్, అనుకుంట, అంకోలీ, తాంటోలీ గ్రామాల్లో విమానాశ్రయ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఈ గ్రామాలన్నీ ఆదిలాబాద్ పట్టణానికి శివార్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఏటీఆర్ టైప్ విమానాలను మాత్రేమే నడిపేందుకు ఏమేరకు అవకాశాలున్నాయనేదానిపై స్టడీ చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీరజ్ గుప్తా చెప్పారు. ఆ తర్వాతే విమానాశ్రయంను మరింత విస్తరిస్తామని చెప్పారు.
1600 ఎకరాల నుంచి 450 ఎకరాలు ఏరోడ్రోమ్
369 ఎకరాల్లో ఉన్న ఏరోడ్రోమ్ను కూడా సమీక్షించిన బృందం... అదనంగా 50 ఎకరాలు సేకరించి ప్రస్తుతం ఉన్న రన్వేను మరింత పెంచాలని ప్రతిపాదన చేసింది. అయితే ఇందుకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అనుమతించాల్సి ఉంది. ఒకవేళ ఇండియన్ ఎయిర్ఫోర్స్ అనుమతి ఇవ్వకపోతే ఒక ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం కోసం ప్రభుత్వం గుర్తించిన 1600 ఎకరాల నుంచి 450 ఎకరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.