ముఖ్యమంత్రిని దింపడానికేనా?
తనను గద్దె దించడానికే ఇదంతా జరుగుతుందనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తెలంగాణ జిల్లాలకు చెందిన తనకు అనుకూలమైన మంత్రుల ద్వారా కార్యకర్తలను తన క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని ప్రసంగాలు చేస్తున్నారని చెబుతున్నారు. మెదక్, మహబూబ్ నగర్ జిల్లా కార్యకర్తలను క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డిని గద్దె దించి అదే సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ నేతకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించే ఆలోచన కూడా అధిష్టానంలో సాగుతున్నట్లు చెబుతున్నారు. ఉద్యమ నేపథ్యాన్ని గమనించి కాంగ్రెసు అధిష్టానం ఆ ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు, సనత్నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించే యోచన జరుగుతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో పెద్ద యెత్తున మతకల్లోలాలు చెలరేగడం వెనక దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దానివల్లనే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవం మర్రి శశిధర్ రెడ్డి మది నుంచి తొలగిపోలేదని అంటారు. మర్రి శశిధర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను కూడా దీటుగా ఎదుర్కోగలరని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, తెలంగాణకు చెందిన నాయకుడు కావడం వల్ల తెలంగాణ ఉద్యమ ఉధృతి కూడా తగ్గే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.