వైయస్ బాటలో కిరణ్: ప్రత్యర్థులపై ఎదురుదాడి
అక్టోబర్ 15 తర్వాత నాయకత్వ మార్పు ఊహాగానాల నేపథ్యంలో తనపై సొంత పార్టీ ప్రత్యర్ధులు ఢిల్లీకి చేస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలకు ఇకపై గట్టి సమాధానం చెప్పేందుకు కిరణ్ నిర్ణయించుకు న్నారు. తనను మార్చాలని ప్రత్యర్ధులు ఢిల్లీలో నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నా కిమ్మనకుండా వ్యవహరిస్తూ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిలో మార్పు వచ్చింది. అలా ఉంటే బలం లేని నాయకుడికి పేరు పడిపోతుందనే ఉద్దేశంతో తన అనుయాయులను పార్టీలోని తన ప్రత్యర్థుల మీదికి ఉసిగొల్పుతున్నారు.
సకల జనుల సమ్మె సందర్భంగా పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ను అరెస్టు చేసి జైలుకు పంపడటంతో పాటు, సొంత పార్టీకే చెందిన మరో ముగ్గురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసిన నాటి నుంచీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రిపై భగ్గుమంటున్నారు. కిరణ్ పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా, సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని బాహాటంగానే ఆరోపిస్తూ వస్తున్నారు.
తాజాగా జరిగిన తెలంగాణ మార్చ్ఫాస్ట్తో వీరిమధ్య ఉన్న వైరం బట్టబయలయింది. క్యాంపు కార్యాలయం వద్దనే తమను రెండుసార్లు అడ్డుకుని అరెస్టు చేయించడం, అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంటీ ఎంపీల అహాన్ని మరింత రెచ్చగొట్టినట్టినట్టయింది. మార్చ్ సమయంలో జానారెడ్డి చక్రం తిప్పారు. ఆయన ఒక దశలో రాజీనామా అస్త్రం సంధించారు. దానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ జత కలిశారు. గత కొద్దిరోజుల నుంచి సీనియర్ పార్లమెంటు సభ్యుడు వి.హన్మంతరావు కూడా కిరణ్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
తమను అరెస్టు చేయడాన్ని అవమానంగా భావించిన ఎనిమిది మంది సొంత పార్టీ ఎంపీలు కిరణ్పై హక్కుల తీర్మానం పెట్టాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు లేఖ రాయడంతో అధిష్ఠానం దృష్టి రాష్ట్రంపై పడటం అనివార్యమయింది. ఒక సీఎం మీద సొంత పార్టీ ఎంపీలు హక్కుల తీర్మానం నోటీసుకు సంబంధించి స్పీకర్కు లేఖ రాయడం దేశ చరిత్ర లో ఇదే తొలిసారి.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్ మంత్రి జానారెడ్డి తనకు సహకరించకపోగా ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నిస్తుండటం కూడా కిరణ్ వైఖరి మార్చుకోవడానికి కారణమైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై ముప్పేట దాడి జరుగుతున్నా ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రాష్ట్రంలో కిరణ్కు మద్దతుదారులెవరూ లేరన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం రావడంతో ఆయన అప్రమత్తమవుతున్నారు. ఫలితంగా తనకు మద్దతునిస్తున్న వారితో ప్రతిరోజూ ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయిస్తున్నారు. దానికి తన మిత్రుడయిన ఎమ్మెల్సీ మాకం రంగారెడ్డిని ముందుకు పెట్టి కాగల కార్యం నడిపిస్తున్నారు.
తనపై ఆరోపణలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, నేతలపై విధేయ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ప్రతి విమర్శలు చేయిస్తూ రాష్ట్రంలో తనకూ వర్గం ఉందని, బలం ఉందని, తాను బలహీనుడిని కాదన్న సంకేతాలు అధిష్ఠానానికి పంపించడంపై కిరణ్ సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, ప్రేంసాగర్రావు, పుల్ల పద్మావతి, ఫరూఖ్ హుస్సేన్తో ప్రతిరోజూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మీద ప్రత్యారోపణ చేయిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఎంపీ మధుయాష్కీపై ప్రత్యారోపణలు చేయించారు. మధు యాష్కీ జాతకం బయటపడతానని, ఆయనకు టికెట్ ఎలా దక్కిందో చెబుతామని, బ్రోకర్లా వ్యవహరిస్తున్నారంటూ రాజేశ్వర్ తీవ్రమైన పదజాలం ప్రయోగించడం చర్చనీయాంశమైంది.
గత కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు మీడియా సమావేశం పెట్టి ఎంపీ జి.వివేక్పై విరుచుకుపడ్డారు. వివేక్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని, జి.వెంకటస్వామి గానీ, వివేక్ గానీ ఒక్క దళితుడికి టికెట్కు టికెట్కు ఇప్పించకపోగా, టికెట్ వచ్చిన దళితులను ఓడించారని ధ్వజమెత్తారు. స్థానికేతుర డయిన వివేక్కు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వవద్దని అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తామన్నారు. అసలు తెలంగాణ ద్రోహి వెంకటస్వామి అని విరుచుకుపడ్డారు. వివేక్కు వ్యతిరేకంగా ఏడు నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు.
జర్నలిజంలో అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్.వి.చంద్రవదన్ సమాచార శాఖ కమిషనర్గా వచ్చిన తర్వాత ప్రచారం రూపు రేఖలు చాలావరకూ మారిపోయాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసేందుకు కావలసిన అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి కూడా సర్కారు సంక్షేమ పథకాలు ఏవిధంగా అందుతున్నాయన్న అంశంపై చంద్రవదన్ స్వయంగా ప్రజల్లోకి వెళ్లి తెలుసుకుంటూ, అధికారులు జనంలోకి వెళితే క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తాయన్న విషయాన్ని అధికారులకు చాటారు. మీడియాలో కూడా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమకార్యక్రమాల వివరాలను ప్రజలకు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.