లోకసభలో తమిళ దుమారం
న్యూఢిల్లీ: శ్రీలంక తమిళులకు మద్దతుగా ఎండిఎంకె, పిఎంకె సభ్యులు బుధవారం లోకసభ కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో సభను స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ రెండు సార్లు వాయిదా వేశారు. మొదట 25 నిమిషాల పాటు ఆయన సభను వాయిదా వేశారు. నల్ల చొక్కాలు ధరించి వచ్చిన తమిళ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. శ్రీలంకలో యుద్ధం ఆపాలని, ప్రణబ్ ప్రకటనతో సంతృప్తి చెందలేదని వారన్నారు. ఈ రెండు పార్టీల సభ్యులకు ఇతర తమిళ సభ్యుల మద్దతు కూడా లభించింది.
శ్రీలంక తమిళుల తరలింపునకు భారత్ సహకారం అందిస్తున్నదని మంగళవారం పార్లమెంటులో ప్రణబ్ ముఖర్జీ ఓ ప్రకటన చేశారు. ఎల్టీటిఇ వల్లే లంక తమిళులు మృతి చెందుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీలంక తమిళులకు ప్రత్యామ్న య ఉపాధి చూపే వరకూ భారత్ సహకరం కొనసాగుతుందని వివరించారు. తమిళుల హక్కుల కోసమే పోరాడుతున్న ఎల్టీటిఇ ఎందుకు కాల్పులు విరమించకూడదని ప్రణబ్ ఘాటుగా ప్రశ్నించడంతో డిఎంకె సభ్యులు కొంచెం వెనక్కు తగ్గారు.