బిసి నేత కృష్ణయ్య, బిజెపి నేత కిషన్ రెడ్డి దీక్ష విరమణ
అనంతరం అమాత్యులు విలేకరులతో మాట్లాడుతూ - విద్యార్థుల ఫీజుల విషయంతోపాటు ఇతర డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులను పిలిపించి నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. కృష్ణయ్య, కిషన్రెడ్డిలు మాట్లాడుతూ - తమ డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 300 హాస్టళ్లు, 17 సమాఖ్యల ఏర్పాటు, వాటికి పాలకమండళ్లను నియమించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఫీజుల చెల్లింపును మూడు స్లాబుల నుంచి ఒక్క స్లాబుకు తగ్గించాలనే విషయంపై కూడా స్పందించారన్నారు. ఎటువంటి ఆస్తినష్టం కలగకుండా ఉద్యమించాలనే తమ పిలుపును మన్నించి విద్యార్థులు, ప్రజా, కుల సంఘాలు ఉద్యమించి తమకు మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తనకు మద్దతుగా దీక్షకు దిగిన కిషన్రెడ్డికి, ఉద్యమానికి చిత్తశుద్ధితో సహకరించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్కు కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు దీక్షలో ఉన్న కృష్ణయ్య, కిషన్రెడ్డిలను ప్రరాపా అధినేత చిరంజీవి పరామర్శించారు. వారితో దాదాపు గంటసేపు మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ - విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. తాను ఇక్కడికి వచ్చే ముందు సీఎంతో ఫోన్లో మాట్లాడానని, ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. కృష్ణయ్య దీక్ష వెనక ఇంజినీరింగ్ కళాశాలలున్నట్లు ప్రభుత్వం అంటోంది కదా అని విలేకర్లు ప్రశ్నించగా - ఆ విషయం తనకు తెలియదని, ఎందుకలా అంటున్నారో వారికే తెలుసని చిరంజీవి బదులిచ్చారు.