తెలంగాణపై ఉలిక్కి పడిన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని, దానికి అనంతపురం రాజధానిగా ఉండాలని చెప్పి తాము ఎన్నికలకు వెళ్లినా ఇక్కడి ప్రజలు తమని లక్షల మెజారిటీతో గెలిపిస్తారని మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి అనంతపురంలో వ్యాఖ్యానించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస భావోద్వేగంతోనే ఆ విజయాలు సొంతం చేసుకుంది తప్ప ఆ పార్టీ గొప్పతనమేమీ లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలని తెరాస నాయకులు అక్కడి ప్రజానీకానికి నూరిపోశారని, అందుకే ఇటీవల ఎన్నికల్లో గెలవగలిగారని వివరించారు. రాజీనామాలు చేసి తిరిగి పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలుపొందాం కాబట్టి ప్రత్యేక తెలంగాణా ఇవ్వాలని డిమాండు చేయడం ఆ పార్టీ నాయకులకు తగదన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి తమ పార్టీ తెలంగాణ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కారణమని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ను ఓడించేవారు అక్కడ లేరని, మాకు మేము ఓడించుకోవడమే జరిగిందని ఆయన నెల్లూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు.. ఇది స్వయంకృతాపరాధమన్నారు. చిన్న చిన్న ఓటములకు కాంగ్రెస్ అదరదు, బెదరదని తెలిపారు. తిరిగి పార్టీ ప్రజలకు చేరువవుతుందని అన్నారు.