తెలంగాణ అంశం: కాంగ్రెసు అధిష్టానంపై ముప్పేట దాడి
ఇప్పటికే, ఈ నెల 17వ తేదీ నుంచి తెంలగాణలో ఉద్యోగులు సహాయ నిరాకరణ సాగిస్తున్నారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మార్చి 1వ తేదీన తెలంగాణ జెఎసి రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని మునుపటిలా ఆషామాషీగా తీసుకునే పరిస్థితి లేదు. పోలీసు బలగాలతో అణచివేసే వాతావరణం కూడా లేదు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకత్వం కూడా ఆందోళన ఉధృతిని పెంచడానికి ప్రయత్నిస్తోంది.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా తెరాస, తెలుగుదేశం పార్టీలతో ఉద్యమంలో పోటీ పడేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఒక రకంగా చూస్తే ప్రతిపక్షాలకు చెందిన నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించాల్సిన అనివార్యతలో వారు పడ్డారు. ఇప్పటికే తెరాస సభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యుల వల్ల శాసనసభా కార్యక్రమాలు ఈ నెల 17వ తేదీ నుంచి స్తంభిస్తున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని, రాష్ట్ర బడ్జెట్ను ఏదో విధంగా ప్రతిపాదించామని ప్రభుత్వం అనిపించుకుంది. కానీ శాసనసభ సమావేశాలు కొనసాగే పరిస్థితి లేదు.
దానికితోడు, పార్లమెంటు సమావేశాలు కూడా స్తంభించే పరిస్థితి వచ్చింది. మూడు పార్టీల నుంచి కూడా కాంగ్రెసు అధిష్టానం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటోంది. సమైక్యాంధ్రకు ఎంతగా ప్రయత్నాలు సాగిస్తున్నా సీమాంధ్ర నాయకులు తెలంగాణ ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎలా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందువల్ల తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని వారు కూడా కోరుతున్నారు. ఆ వాతావరణంలో తెలంగాణ సమస్యను వాయిదా వేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లభించే అవకాశాలు కనిపించడం లేదు.
తెలంగాణ ప్రాంత నాయకులు పార్టీలకు అతీతంగా పనిచేయడం లేదు. అయితే, పార్టీలపరంగానే ఉద్యమం కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణ జెఎసి ఆందోళనలకు మాత్రం మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ జెఎసి ఇప్పటికీ ఒక సమన్వయ యంత్రాంగం మాదిరిగానే పనిచేస్తోంది. తెలంగాణ జెఎసి ఇప్పుడు ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకుంది. అందువల్ల తెలంగాణపై నాన్చివేత ధోరణిని కాంగ్రెసు అధిష్టానం అవలంబించే పరిస్థితి లేదు.