పుట్టపర్తి సత్య సాయిబాబుకు అస్వస్థత, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిక
ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు సోమవారం మధ్యాహ్నం సత్యసాయి ట్రస్టు ముఖ్యులు గుర్తించారు. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక విభాగంలో వైద్య బృందంతో చికిత్స చేయించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు బాబా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. రాత్రి 8 గంటల సమయంలో సెంట్రల్ ట్రస్టు సభ్యుడు ఆర్జే రత్నాకర్ మీడియాతో మాట్లాడారు. "బాబా హృదయ స్పందన తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. అందువల్ల ఆయనకు పేస్మేకర్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు'' అని రత్నాకర్ తెలిపారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ల బృందం విడుదల చేసిన మెడికల్ రిపోర్టును కూడా రత్నాకర్ విలేకరులకు అందజేశారు.
బాబా గత ఏడాది నవంబర్లో 85వ జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. తన జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాదీ సత్యసాయి భక్తులకు దర్శనమిచ్చి, ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు. అయితే గత నవంబర్లో జరిగిన వేడుకల్లో మాత్రం ఆయన ఎలాంటి ప్రసంగం చేయలేదు. పుట్టపర్తిలో ఉన్న సమయంలో ఆయన ప్రతిరోజూ భక్తులకు దర్శనమిచ్చేవారు. అయితే ఈ ఏడాది అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నారు. మూడు రోజుల క్రితం (శనివారం) కుల్వంత్హాల్లో భక్తులకు దర్శనమిచ్చిన బాబా, రెండు రోజులుగా తన ప్రత్యేక మందిరానికే పరిమితమయ్యారు. అనారోగ్యం వల్లే ఆయన ప్రతిరోజూ దర్శనమివ్వలేని పరిస్థితిలో ఉన్నారని భక్తులు భావించారు.