సిండికేట్లు, ఆబ్కారీ ఆఫీసర్ల ఇళ్లలో ఎసిబి సోదాలు
మధుసూదన్ రావు ఇంటి నుంచి ఎసిబి అధికారులు లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మధుసూదన రావు బ్యాంకు లాకర్లను తెరవడానికి ఎసిబి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మంలో నలుగురు ఆబ్కారీ అధికారులను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మధుసూదన రావు ఇంటిలోనే కాకుండా ఆబ్కారీ అధికారులు నర్సింహారావు, శంకరయ్య, నర్సింగ రావు ఇళ్లలో ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి.
ఖమ్మం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్ శంకరయ్య నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం సిండికేట్లలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు రావడంతో ఆయన కొంత కాలంగా సెలవులో ఉన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం కోటపల్లిలోని శంకరయ్య బంధువుల ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు దాడులు చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ టీచర్స్ కాలనీలోని ఖమ్మం ఎక్సైజ్ సిఐ సర్వేశ్వరనాథ్ ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హన్మకొండ అడ్వకేట్స్ కాలలీలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. విజయవాడలోని కినీరా వైన్స్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.