తెలంగాణ కోసం మరో ఆత్మహత్య, సభలోనే తెరాస
కాగా, తెలంగాణపై తెరాస, బిజెపి సభ్యులతో పాటు స్వతంత్ర సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి చర్చకు పట్టుబట్టడంతో శాససభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రేపటికి వాయిదా వేశారు. అయినా సభ్యులు శాసనసభను విడిచి వెళ్లలేదు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసే వరకు సభలోనే ఉంటామని వారు చెబుతున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించే వరకు పోరాటం చేస్తామని తెరాస సభ్యుడు సోమారపు సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని డిమాండ్ చేశారు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టిపోసుకోవడానికే సభా కార్యక్రమాలను తెలుగుదేశం, కాంగ్రెసు వినియోగిస్తున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలను గాయపరిచే విధంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెరాస శాసనసభ్యుడు కొప్పులు ఈశ్వర్ అన్నారు. తెలంగాణపై వైఖరి చెప్పకుండా కాంగ్రెసు, తెలుగుదేశం సభను వాయిదా వేసుకుని పోతున్నాయని ఆయన అన్నారు. ఎన్ని వందల మంది విద్యార్థులను బలిగొంటారని ఆయన అడిగారు. తెలంగాణ తీర్మనం పెట్టే వరకు సభలోనే ఉంటామని ఆయన చెప్పారు.