ఉప పోరు: వైయస్ జగన్పై దాడి పెంచిన కాంగ్రెసు
ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే వైయస్ జగన్ కాంగ్రెసును విమర్శిస్తున్నారని రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. వైయస్ జగన్కు ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటేసినట్లేనని మరో మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో వైయస్ జగన్కు అవగాహన ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెసు నాయకులు, మంత్రులతో సహా జగన్పై విమర్శలు సంధిస్తున్నారు.
రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు. మరోవైపు మంత్రులు ఎక్కడికక్కడ జగన్ హవాను కట్టిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ మంత్రులు కూడా సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించనున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎన్నికలు జరిగే స్థానాలున్న జిల్లాల నాయకులతో సమీక్ష జరిపారు. వైయస్ జగన్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించకూడదని, జగన్పై విమర్శల దాడి పెంచాలని కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మంత్రులకు, జిల్లా నాయకులకు సూచించారు.
వైయస్సార్పై విమర్శలు ఎక్కుపెట్టేందుకు కాంగ్రెసు నాయకులు సిద్ధపడ్డారు. జగన్ అవినీతిని, వైయస్సార్ను వేర్వేరుగా చూడలేమని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ, శాసనసభ్యుడు వీరశివా రెడ్డి అన్నారు. వైయస్ జగన్ను ఎట్టి పరిస్థితిలోనూ వదిలేయకూడదని, జగన్ను ఏ విధంగానైనా సరే కట్టడి చేయాలని కాంగ్రెసు పార్టీ ముందుకు సాగే ఉద్దేశంతో ఉంది. ఇందులో భాగంగానే జగన్పై కాంగ్రెసు నాయకుల విమర్శ దాడి పెరిగింది.