వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదు: ఇందిరమ్మ బాటపై సిఎం
వైద్యులు ఉద్యోగం చేసే చోటనే నివాసం ఉండాలని ఆయన అన్నారు. వైద్యులు విధులకు రాకపోతే తనకు ఒక్క లేఖ రాస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. ప్రజలకు సేవలు అందించడానికి మాత్రమే ఇందిరమ్మ బాటను చేపట్టినట్లు ఆయన తెలిపారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలను చేరవేయడానికి ఇందిరమ్మ బాట ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అధికారులను బలి చేయడానికి ఇందిరమ్మ బాటను చేపట్టలేదని ఆయన అన్నారు. కోర్టు తీర్పు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రాజమండ్రి గోకవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్సీలు చినరాజప్ప, భాస్కరామారావు సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం ప్రయాణించాల్సిన విమానం గంట ఆలస్యం కావడంతో, జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమం గంట ఆలస్యంగా ప్రారంభమైంది.