కుట్ర: పశ్చిమ బెంగాల్ రేప్లపై మమతా బెనర్జీ
ఏదైనా అటువంటి సంఘటన జరిగితే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారని తాను చెబుతూ వస్తున్నానని ఆమె గుర్తు చేశారు. కల్పితమైన సంఘటనలను సృష్టించి బెంగాల్ మాతృత్వాన్ని అవమానపరచవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోల్కత్తా పోలీసు ఫంక్షన్లో ఆమె మాట్లాడారు.
తప్పుడు ప్రచారం సాగిస్తున్న శక్తులు ఏవనే విషయాన్ని ఆమె చెప్పలేదు. బెంగాల్ నాగరికమైందని, సంస్కృతికి పెట్టింది పేరని, న్యూస్ చానెల్స్లో హత్యలకు, రేప్, అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రతి రోజూ వస్తున్న విషయాలతో తాను విసిగిపోయానని ఆమె అన్నారు.
ప్రతికూల భావన కూడదని, సానుకూల భావనతో తాను ముందుకు సాగుతానని ఆయన అన్నారు. ప్రతికూలతను సానుకూలాంశంగా మార్చుకోవచ్చునని ఆమె అన్నారు. కొంత మంది పోలీసులు కార్యకలాపాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్న మాట నిజమేనని ఆమె అన్నారు. వారి ప్రవర్తనను తాను మార్చదలుచుకున్నానని ఆమె అన్నారు.
పోలీసు వ్యవస్థ బలంగా, ప్రజానుకూలంగా, మానవత్వంతో ఉండాలని ఆమె అన్నారు. పోలీసుల్లో మంచివారు కూడా ఉన్నారని ఆమె అన్నారు. పోలీసులు కూడా మానవమాత్రులేనని, అల్లర్ల సమయంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారు చేసిన సేవలను మనం గుర్తించాలని మమతా బెనర్జీ అన్నారు.