తెలంగాణ: జగన్ పార్టీలో సెకండ్ వికెట్!, రిజైన్కు కాపు
దీంతో కాపు రామచంద్ర రెడ్డి తన రాజీనామా లేఖను జెఏసి నేతలకు ఇచ్చారు. కేంద్రం నిర్ణయం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉంటే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాపు వారికి చెప్పారు. తాను సమైక్యవాదినే అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకే తాను నడుచుకుంటానని చెప్పారు. కాగా మూడు రోజుల క్రితం జగన్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తన రాజీనామా లేఖను జెఏసి నేతలకు ఇచ్చిన విషయం తెలిసిందే.
సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నిలవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి ఇంటిని పలువురు సమైక్యవాదులు ఆదివారం ముట్టడించారు. వారు సమైక్యవాదానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని వారు గుర్నాథ్ రెడ్డి ఇంటి వద్ద డిమాండ్ చేశారు. దీంతో అతను తాను సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాకు కూడా సిద్ధమని చెప్పారు.
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తుందనే ప్రచారం నేపథ్యంలో సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా రాజీనామా చేయాలని సమైక్యాంధ్ర జెఏసి నేతలు ఒత్తిడి తేవడంతో గుర్నాథ్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని జెఏసి నేతలకు సమర్పించారు. అదే లేఖను తాను సభాపతి(స్పీకర్)కి పంపిస్తానని ఆయన జెఏసి నేతలకు చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచారన్నారు. వారి త్యాగాలు వృథా కానీయమన్నారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రెండుమూడు రోజుల్లో హైదరాబాద్ వెళ్లి తాను సభాపతికి రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. కాగా గుర్నాథ్ రాజీనామాను స్పీకర్కు ఫ్యాక్స్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.