తెలంగాణ: వైయస్ జగన్ పార్టీకి ఎదురీతే (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో ఎదురీత తప్పేట్లు లేదు. మొదట్లో నాయకుల కారణంగా, వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన రైతు దీక్ష కారణంగా, వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నిక వల్ల, షర్మిల పాదయాత్ర వల్ల తెలంగాణలో కాస్తా ఊపు వచ్చినట్లు కనిపించింది. తెలంగాణలోని చాలా మంది కాంగ్రెసు నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరవచ్చుననే ప్రచారం జరిగింది.
ప్రచారం జరిగినట్లుగా పెద్ద యెత్తున నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరకపోగా, ఉన్న నాయకులే అసంతృప్తికి గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ రేపో మాపో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. నల్లగొండ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ, వారు ఇప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లలేదు. ఎన్నికల సమయానికి వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారా, లేదా అనేది కూడా చెప్పలేని స్థితి.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేవెళ్ల సెంటిమెంట్ను వాడుకున్నారు. ఆమె ఇటీవల చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలో తమ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని ఆమె ప్రకటించారు.
చేవెళ్ల రచ్చబండకు తెలంగాణ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. మిగతా నాయకులు చాలా మంది విజయమ్మ రచ్చబండ కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా చాలా మంది రాలేదని వార్తలు వచ్చాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దక్షిణ తెలంగాణ ఇంచార్జీ జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా చేవెళ్ల రచ్చబండ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయనకు భువనగిరి శానససభా నియోజకవర్గంలో ఇతోధికమైన బలం ఉంది. ఆయన రాకపోవడానికి కారణమేమిటనేది తెలియదు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కెకె మహేందర్ రెడ్డి చురుగ్గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన చేవెళ్ల రచ్చబండ కార్యక్రమానికి రాకుండా ఆదివారంనాడు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.
కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పూర్తిగా దూరమైనట్లేనని చెబుతున్నారు. వారు వేరే పార్టీలో చేరవచ్చుననే ప్రచారం సాగుతోంది. చాలా కాలంగా వాళ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక, సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కానీ, ఆయన చురుగ్గా వ్యవహరించడం లేదు. మాజీ శానససభ్యుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఆయనకు రాజకీయాల కన్నా వ్యాపారాలు ముఖ్యం కావడమే అందుకు కారణమని అంటున్నారు. తెలంగాణలో బలమైన శక్తిగా భావించిన కొండా దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దూరమైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుంది.
చేవెళ్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి కొండా దంపతులే కాకుండా, పార్టీకి ముఖ్య నేత కెకె మహేందర్రెడ్డి, దక్షిణ తెలంగాణ ఇన్చార్జి జిట్టా జిట్టా బాలకృష్ణారెడ్డి, రాజ్ ఠాకూర్ వంటి నేతలు కూడా దూరంగా ఉండటం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. రచ్చబండకు రావాలంటూ చాలామందికి విజయలక్ష్మి స్వయంగా ఫోన్ చేసి కోరడంవల్లే తెలంగాణ నేతల హాజరు కొంత మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, రచ్చబండకు గైర్హాజరైన కెకె మహేందర్రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్రకు వెళ్లారు. కెకె మహేందర్ రెడ్డి పార్టీలో చురుగ్గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావును ఢీకొట్టడమే ఆయన ప్రధాన లక్ష్యం. తెలంగాణలో బాజిరెడ్డి గోవర్ధన్ వంటి నాయకులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.