జేసీ బ్రదర్స్ రూటు మారింది.. టీడీపీలో కలకలం
అనంతపురం: రాష్ట్ర రాజకీయాలను కుదుపులకు గురి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ వీడియో కాల్స్ వ్యవహారం ఇప్పుడు తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోపై చెలరేగిన వివాదాలు కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి రోజూ స్పందిస్తూనే వస్తోన్నారు. ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూనే ఉన్నారు.
జేసీ పట్టు..
అయినప్పటికీ- జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉంటోన్నారు జేసీ బ్రదర్స్. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపి చేదు ఫలితాలను చవి చూశారు. ఆ తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించినప్పటికీ.. తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం పార్టీ పాగా వేయగలిగింది. దీనికి ప్రధాన కారణం- జేసీ కుటుంబానికి ఉన్న పట్టు.
గోరంట్ల వీడియోపై
అలాంటి జేసీ బ్రదర్స్.. గోరంట్ల మాధవ్ వీడియో కాల్స్ విషయంలో పెద్దగా స్పందించలేదు. గోరంట్ల మాధవ్ను గానీ, ఆ వీడియోను అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు చేయలేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత- రోజుల తరబడి ఈ అంశంపై విమర్శలు సంధిస్తూ వచ్చారు గానీ జేసీ బ్రదర్స్ మాత్రం ఆ ఊసే ఎత్తట్లేదు.
జేసీ దివాకర్తో..
నిజానికి- గోరంట్ల మాధవ్కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందే ఒక రకంగా జేసీ దివాకర్ రెడ్డే. 2018లో ప్రబోధానంద ఆశ్రమం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో జిల్లా పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. అప్పట్లో ఆయన పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. విలేకరుల సమావేశంలో మీసం మెలేసి, నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు. ఆ కామెంట్స్తో గోరంట్ల మాధవ్ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పాత వైరం ఉన్నప్పటికీ..
ఈ వ్యాఖ్యల తరువాత జేసీ దివాకర్ రెడ్డి కూడా గోరంట్ల మాధవ్పై అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎక్కడికి రావాలో చెప్పు అంటూ సవాల్ విసిరారు. అప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్య పాత వైరం కొనసాగుతూనే వస్తోంది. మాధవ్ వీడియో వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత జేసీ దివాకర్ రెడ్డి గానీ, ఆయన సోదరుడు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గానీ పెద్దగా స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైసీపీపై మెతక వైఖరి..
మాధవ్ పట్ల జేసీ బ్రదర్స్ మెతక వైఖరికి కారణాలేమిటనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అన్నదమ్ములిద్దరూ క్రమంగా టీడీపీకి దూరమౌతారా? అనే వాదనలు సైతం వినిపిస్తోన్నాయి. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన తరువాత అనంతపురం జిల్లాలో పార్టీకి సీనియర్ నాయకుడంటూ లేరని, అందుకే జేసీ బ్రదర్స్ను వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీలోకి చేర్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయాలు ఉన్నాయి.