‘తీవ్ర ముప్పు’ కేటగిరిలో ఏపీ మూడు జిల్లాలు: ఐఎండి స్టడీ
న్యూఢిల్లీ: ఉష్ణమండల తుఫానులకు సంబంధించి దేశంలోని 4తూర్పుతీర రాష్ట్రాల్లోని 12 జిల్లాలు ‘అత్యంత తీవ్ర ముప్పు' కేటగిరీలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధ్యయనం వెల్లడించింది. ఐఎండి అధ్యయనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి.
ఏపితోపాటు ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్లో 4, తమిళనాడులో ఒక జిల్లా ఈ జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు భౌగోళికంగా ఏపీలో ఉన్నా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ‘యానాం' కూడా ఇందులోనే ఉంది. మొత్తంమీద 13 తీర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 41 జిల్లాలు తుపానుల నుంచి ‘తీవ్ర ముప్పు' కేటగిరీలో ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
మరో 96 జిల్లాలపై నిర్వహించిన అధ్యయనంలో 30 జిల్లాలు ‘ఓ మోస్తరు ముప్పు', మరో 13 ‘తక్కువ ముప్పు' కేటగిరీలలోకి వచ్చాయి. దేశంలో 1891 నుంచి 2010 మధ్య సంభవించిన తుపానుల గణాంకాలను విశ్లేషించి ఈ మేరకు తేల్చినట్లు ఐఎండీ తుఫాను హెచ్చరికల విభాగం అధిపతి మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు.
ప్రపంచంలో సంభవించే ఉష్ణమండల తుపానులలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో పుట్టేవి 7 శాతం మాత్రమేనన్నారు. అయినప్పటికీ వాటి ప్రభావం, తీవ్రత తీరప్రాంత జిల్లాలపై అత్యంత అధికంగా ఉంటుందని తెలిపారు.