మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత- వాహనాలకు నిప్పు: వైసీపీ-టీడీపీ దాడులతో..!!
పల్నాడు: పల్నాడు జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం నాయకుల మధ్య పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం ఘర్షణలకు దిగారు. రాళ్లు రువ్వు కున్నారు. వాహనాలను సైతం దగ్ధం చేశారు. ఈ ఘటనతో పట్టణంలో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులు రంగంలోకి దిగి- రెండు పార్టీల నాయకులను చెదరగొట్టడానికి లాఠీఛార్జి చేశారు.
టీడీపీ ఆందోళన..
ఈ దాడుల పట్ల తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులను రౌడీ మూకలుగా అభివర్ణించింది. వైసీపీ రౌడీలు, గూండాలను పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తింది. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోందంటూ మండిపడింది. మాచర్లలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రాణాంతక దాడులకు పాల్పడిందని ధ్వజమెత్తింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి, తమ పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిందని ఆరోపించింది.
ఇదేం ఖర్మ..
జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా- మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి పట్టణంలో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. వైసీపీ నాయకుడు తురకా కిషోర్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న వార్డులో బ్రహ్మారెడ్డి, ఇతర నాయకులు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటానికి కారణమైంది.
గడప గడపకు..
అదే వార్డులో తురకా కిషోర్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ రెండు పార్టీల నాయకులు ఎదురుపడ్డారు. పరస్పరం వాగ్వివాదానికి దిగారు. తన డివిజన్ పరిధిలోకి వచ్చి తన పైనే దుష్ప్రచారాన్ని చేస్తోన్నారంటూ మండిపడ్డారు తురకా కిషోర్. తనపై దుష్ప్రచారం ఎందుకు చేస్తోన్నారంటూ నిలదీశారు. వైసీపీ- టీడీపీ నాయకుల మధ్య వాగ్వివాదానికి దారి తీసింది.
ముదిరిన వాగ్వివాదం..
ఈ వాగ్వివాదం కాస్తా మరింత ముదిరింది. పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. వైసీపీ-టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. కర్రలు తీసుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఓ వాహనానికి నిప్పు పెట్టారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గం కార్యాలయానికీ నిప్పు పెట్టారు. ఈ కార్యలయం పూర్తిగా దగ్ధమైంది.
తీవ్ర ఉద్రిక్తత..
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. లాఠీ ఛార్జ్ చేశారు. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాళ్ల దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు.