ఎపిలో చంద్రబాబుపై ఇక కాంగ్రెసు పోరుబాట (పిక్చర్స్)
విశాఖపట్నం: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన కాంగ్రెసు ఆ విషాదం నుంచి తేరుకుని పోరుబాటకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, రైతు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై చంద్రబాబును నిలదీస్తూ సోమవారం ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
రుణమాఫీ చేసి, సకాలంలో రైతులకు ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం నగర కాంగ్రెసు పార్టీ సోమవారం కలెక్టర్ కార్యాయం ఎదుట ధర్నాకు దిగింది. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు విమర్శించారు.
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బెహరా భాస్కర రావు, మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, బోలిశెట్టి సత్యనారాయణ, మాజీ మేయరు పులుసు జనార్ధన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెసు ధర్నా
రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిరసిస్తూ విశాఖపట్నం నగర కాంగ్రెసు పార్టీ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టింది.
చంద్రబాబుకు వ్యతిరేకంగా...
ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్న టిడిపి వైఖరికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టిడిపిపై ఫైర్
ధర్నాను ఉద్దేశించి బాలరాజు ప్రసంగించారు. రైతు వ్యతిరేకి అని ముద్ర పడిన తెలుగుదేశం పార్టీ దాన్ని చేరిపివేసుకోవడానికి సాధ్యం కాని హామీలు ఇస్తూ రైతులను మోసగించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెసు నాయకులు ఇలా...
ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెసు నాయకులు ఎట్టకేలకు కోలుకుని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు.