రాజధానికి లోగో గీసి బహుమతి పొందొచ్చు: ప్రజలకే బాబు బాధ్యత
అమరావతి: ఏపీ ప్రభుత్వం దసరా పర్వదనం అయిన ఈ నెల 22వ తేదీన రాజధాని అమవరాతి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా రాజధాని పేరుతో ఒక చిహ్నాన్ని రూపొందించాలని భావిస్తోంది.
రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుతంగా నిర్మించేందుకు ప్రభుత్వం తొలి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. వివిధ దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా ఓ లోగో రూపొందిస్తాయి. ఈ తరహాలోనే ఏపీ రాజధాని నిర్మాణానికి గుర్తుగా ఒక చిహ్నాన్ని రూపొందించాలని ఏపీ భావించింది.
ఆ లోగో బాధ్యతను ప్రజలకే అప్పగించింది. రాష్ట్రంతో పాటు దేశం, విదేశాల్లో ఉంటున్న వారు ఎవరైనా మంచి చిహ్నాన్ని రూపొందించి పంపించవచ్చు. ఏపీ కోసం చిహ్నం రూపొందించి పంపిస్తే... దానికి ప్రభుత్వం ఓకే చెబితే.. రూపొందించిన వారు బహుమతి కూడా పొందవచ్చు.
ఇందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అమరావతి రాజధాని చిహ్నం ఉదయించే సూర్యుడిని రూపంలో ఉండాలి. అందులో అమరావతి ప్రాంత ప్రజల జీవనశైలి ప్రతిబింబించాలి. రాజధాని ప్రాంతంలో పండే పంటలు, గలగలా పారే కృష్ణమ్మ, ప్రజల, ప్రపంచస్థాయి రాజధాని, ప్రజల జీవన నగరం తదితర అంశాలతో, ఆకర్షణీయ రంగులతో చిహ్నం ఉండాలి.
రూపొందించిన చిహ్నాన్ని సీఆర్డీఏ వెబ్సైట్కు ఈ నెల 15వ తేదీ లోగా పంపించారు. ఉత్తమ చిహ్నాన్ని రూపొందించిన మొదటి ముగ్గురికి రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు ఇస్తారు.
ఇదిలా ఉండగా, రాజధాని నగర నిర్మాణానికి లక్షా ఎనిమిదివేల ఇటుకలు ఇస్తామంటూ గుంటూరుకి చెందిన ఆలపాటి కోటేశ్వర రావు, డాక్టర్ ఆలపాటి అమృత ముందుకి వచ్చినట్టు తుళ్లూరు తహసీల్దారు అన్నె సుధీర్ బాబు తెలిపారు.
శంకుస్థాపన సందర్భంగా వినియోగించే నవరత్నాలను తుళ్లూరు మండలానికి చెందిన కొందరు ఇవ్వనున్నారని తెలుస్తోంది. వాటి విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. బాపట్ల మండలాధ్యక్షురాలు విజేత కిలో వెండితో కలశం సిద్ధం చేయిస్తున్నారు.
కలశంపై లక్ష్మి, గణపతి, సరస్వతి, బుద్ధుడి బొమ్మలు ఉండేలా చూస్తున్నారు. నేలపాడుకి చెందిన ధనేకుల సుబ్బారావు రూ.2 లక్షల విలువైన పూజాసామగ్రిని అందజేస్తున్నారు. గణపతిహోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాల్లో వినియోగించే వస్తువుల్ని ఆయన సమకూరుస్తున్నారు.
వేదపండితులకు వస్త్రాలు వంటివన్నీ కూడా ఆయనే ఇవ్వనున్నారు. ముప్పరపు కృష్ణారావు రూ.లక్ష విలువైన వెండి సామగ్రి ఇస్తున్నారు. శంకుస్థాపనకు అవసరమైన సామగ్రి ఇచ్చేవారందరినీ ఈ నెల 15 నాటికే తమకు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.