ప్రత్యేకహోదా అవసరం లేదు: ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ మంత్రి మాణిక్యాలరావు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు హోదా అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా లేకుండానే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకహోదా రాష్ట్రంగా కాకుండా ప్రత్యేక రాష్ట్రంగా అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. రెవెన్యూ లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.
ఏపీలో బీజేపీది ఇబ్బందికర పరిస్థితి: విష్ణుకుమార్ రాజు
ఏపీలో బీజేపీ ఇబ్బందికర పరిస్థితిలో పడిందని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని తన భార్య కూడా అడుగుతోందని ఆయన చెప్పారు.
ప్రజల్లో హోదా సెంటిమెంట్ బలంగా మారిందని, హోదాను సెంటిమెంట్గా మార్చడంలో ప్రతిపక్షాలు విజయవంతమయ్యాయని ఆయన చెప్పారు. గత రెండేళ్లలో ఏపీకి చేసింది చెప్పుకోవడంలో విఫలమయ్యామని, చెయ్యాల్సింది చెప్పడంలో తమకు స్పష్టత లేదని ఆయన అన్నారు.
హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలి: నారాయణ
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా విషయంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని అన్నారు. గురువారం ఆయన విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్కడ ఏం జరుగుతుందో తమ పార్టీకి కూడా తెలుసని చెప్పారు.
ఏపీకి హోదా కల్పించే విషయంలో కేంద్రం చర్యలను ఆయన తప్పుబట్టారు. పార్లమెంటులో చట్టాలు చేసేది మనమేనని.. మనం చేసిన చట్టాలను మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందన్నారు.
ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతిచ్చిన రాజకీయ పార్టీలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.