కేంద్రం నీచంగా ప్రవర్తిస్తోంది: అశోక్ గజపతిరాజు, ‘జగన్ పార్టీ ఎంపీల సంగతేంటి?’
విజయనగరం: కేంద్ర ప్రభుత్వ తీరుపై మాజీ కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసినా.. వారి రాజీనామాలను ఆమోదించకుండా కేంద్రం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
రాజీనామాలు ఆమోదించని కారణంగా వైసీపీ ఎంపీలంతా ప్రభుత్వపరంగా లభించే సదుపాయాలన్నీ అనుభవిస్తున్నారని అన్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన చీపురుపల్లి నియోజకవర్గస్థాయి టీడీపీ మినీ మహానాడులో అశోక్ గజపతిరాజు పాల్గొని ప్రసంగించారు.
దేశంలో 115 వెనుకబడిన జిల్లాలను గుర్తించగా, అందులో రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ఉన్నాయన్నారు. అయితే, ఒక్కో జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 50కోట్ల చొప్పున మొత్తం రూ.300కోట్లు కేంద్రం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని చెప్పారు. కేంద్రం వైఖరికి ఇంతకంటే మంచి నిదర్శనం అవసరం లేదని అశోక్ గజపతి రాజు అన్నారు.
హోదా కోసం లోకసభ ఎంపీలతో రాజీనామా చేయించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. కేంద్రం, వైసీపీ గమ్మత్తైన రాజకీయ చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం, చట్ట సభలను అగౌరపరిచేలా మిలాఖత్ రాజకీయాలతో కేంద్రం అనుసరిస్తున్న ప్రవర్తన నీచంగా ఉందని అశోక్ గజపతిరాజు అన్నారు.