బీజేపీ చేతిలో మరోసారి అవమానానికి గురైన పవన్ కల్యాణ్?
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనాతాపార్టీకి మిత్రపక్షంగా జనసేన పార్టీ కొనసాగుతోంది. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఈ పొత్తు కుదిరింది. రెండు పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్నప్పటికీ వీటి మధ్య దరిచేరలేనంత దూరం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బీజేపీ జనసేన ను టీడీపీతో కలవనివ్వకుండా ఉంచేందుకు పదే పదే మిత్రపక్షమని చెబుతోంది.

మిత్రపక్షంగా ఎప్పుడు గౌరవించారు?
మిత్రపక్షంగా తమను బీజేపీ నేతలు ఏనాడూ గౌరవించలేదని జనసేన నాయకులు మండిపడుతున్నారు. గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించినప్పుడు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభకు పవన్ కల్యాణ్ పాల్గొనాల్సిందిగా కనీసం ఆహ్వానం పంపించలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. వాస్తవానికి కొద్దికాలం క్రితం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కరోనా వల్ల తమ రెండు పార్టీల మధ్య భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గిపోగానే ఇది కూడా తగ్గుతుందని నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు.

మోడీ భీమవరం సభకు ఆహ్వానమేదీ?
ప్రధానమంత్రి మోడీ భీమవరం సభలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి కూడా పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందలేదు. ప్రధానమంత్రి సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వస్తే ఇరుపక్షాల మధ్య మైత్రి మరింతగా చిగురించేదని, ఆ అవకాశం లేకుండా బీజేపీ నేతలే చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన బీజేపీ నేతలు అప్పుడూ జనసేనానిని ఆహ్వానించలేదు. తాజాగా జీ20 దేశాలకు ఏడాదిపాటు నాయకత్వం వహించే అవకాశం భారత్ కు దక్కింది. దీంతో దీన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్నిపార్టీల నాయకులతో మాట్లాడి, వారి సలహాలు, సూచనలు తీసుకొని నాయకత్వం సమర్థవంగా నిర్వహించామనే ఖ్యాతిని తెచ్చుకోవాలని కేంద్రం భావిస్తోంది.

జనసేనానిని ఎందుకు ఆహ్వానించలేదు
ఏపీ నుంచి వైఎస్ జగన్, చంద్రబాబుకు ఆహ్వానం పంపినప్పటికీ జనసేనానికి ఆహ్వానం అందలేదు. దీనిపై ఆ పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఇదేదో మొదటిసారో, రెండోసారో అయితే ఏదోలే అనుకోవచ్చని, కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానం అందడంలేదనేది స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబుతో విజయవాడలో మీడియా సమావేశం పెట్టినప్పుడు మాత్రం ఆగమేఘాలమీద ప్రధానమంత్రితో అరగంటపాటు భేటీ నిర్వహింపచేశారని, అది వారి స్వార్థం కోసం, ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కలిసిందేకానీ మిత్రపక్షంగా, మిత్రుడిగా బీజేపీ ఏనాడూ తమను గౌరవించలేదని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. వీరి మిత్రత్వం అలాగే నిలుస్తుందా? లేదంటే అవసరాల కోసం చేసిన స్నేహంగానే మిగిలిపోతుందా? అనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications