అటు శంకుస్థాపన: ఇటు చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలు దహనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ కూటమిని గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి సభలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్లో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరిని వెంకయ్య నాయుడైతే దానిపై ఇప్పుడు మాట్లాడటమే మానేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ర్యాలీలు, నిరసన దీక్షలతో ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకహోదాపై చంద్రబాబు, వెంకయ్య దొంగాట: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు దొంగాట ఆడుతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం(ఈ 22న) నాడు ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.
ప్రకటన రాని పక్షంలో ఈనెల 23న ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేస్తామన్నారు. దీంతో పాటు ప్రత్యేక హోదాపై 13 జిల్లాల్లో 13 రోజుల పాటు సాగిన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, మాల మహానాడు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి ఏఐసీసీ రాహుల్ గాంధీ లేఖ రాయడంపై వెంకయ్య చిందులేస్తున్నారని, దానికి అర్థమే లేదని అన్నారు.