ఎక్కడ స్నానం చేసినా ఒక్కటే, ఇక్కడే ఉంటా, 10లక్షల పరిహారం: బాబు, కవిత స్పందన
రాజమండ్రి: భక్తులు సంయమనం పాటించాలని, 12 రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా, ఏ ఘాట్లో చేసినా ఒక్కటేనని, అవసరమైతే తాను ఈ 11 రోజులు ఇక్కటే ఉంటానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు.
అందరు ఒకే ఘాట్ వద్దకు వచ్చే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ ఘాట్లో స్నానం చేసినా ఒక్కటేనని గుర్తించాలన్నారు. పోలీసుల సూచనలను భక్తులు పాటించాలని కోరారు. ఘాట్ల వద్ద భక్తులు క్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. మృతి చెందిన వారిని తీసుకు రాలేమని, కానీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మా పైన ఉందని చెప్పారు. 12 రోజుల్లో ఎప్పుడు పుష్కరాలకు వచ్చినా ఒక్కటేనని భక్తులు గుర్తించాలని కోరారు.
27కు చేరిన మృతులు
రాజమండ్రి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరినట్లుగా తెలుస్తోంది.
తొక్కిసలాటపై కవిత
రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట ఘటన బాధాకరమని టీఆర్ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. పుష్కరాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భక్తులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.