పుష్కర ముగింపునకు సింధుని రప్పించారు: కేసీఆర్ మీద చంద్రబాబు పైచేయి
అమరావతి: కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుని ఏపీ ప్రభుత్వం సత్కరించింది. పీవీ సింధు, కోచ్ గోపీచంద్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పైచేయి సాధించినట్లుగా కనిపిస్తున్నారు.
విజయవాడలోని వారిద్దరికీ ఘనమైన స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేయడంతోపాటు వేదికపై వారిని సన్మానించి నజరానాలు ప్రకటించారు. తిరిగి వారిద్దరినీ కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవాలకు వచ్చేలా చేశారు. పవిత్ర సంగమం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై పీవీ సింధుకు రూ. 3 కోట్ల చెక్ తో పాటు, రాజధాని ప్రాంతంలో కేటాయించిన 1000 గజాల భూమి పత్రాలను స్వయంగా అందజేశారు.
మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం కన్నా పీవీ సింధు విజయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా క్యాష్ చేసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 3 కోట్ల రూపాయల నగదు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, ప్రముఖ ఆథ్యాత్మిక గురువు గణపతి సచ్చాదానంద స్వామి అందజేశారు.
3 కోట్ల రూపాయల నగదు చెక్కుతో పాటు నవ్యాంధ్ర నూతర రాజధానిలో సింధుకు నజరానాగా ఇచ్చిన 1000 గజాల స్థలానికి సంబంధించిన భూమి పత్రాలను అందజేశారు. వెంకయ్యనాయుడు పుష్ప గుచ్ఛంతో సింధుని అభినందించగా, గణపతి సచ్ఛిదానంద స్వామి శాలువతో సత్కరించారు.
సింధు కోచ్ గోపీచంద్కు 50 లక్షల రూపాయల చెక్కుతోపాటు, రియో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కిదాంబి శ్రీకాంత్కు 25 లక్షల రూపాయల చెక్కులిచ్చి సత్కరించారు. అనంతరం సింధు తల్లిదండ్రులను జ్ఞాపికతో సత్కరించారు.