cm జగన్ చెప్పింది నిజమే: చంద్రబాబు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సెటైర్లు వేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. తన వెనక నలుగురున్నారని బీసీల సభ సాక్షిగా జగన్ చెప్పింది నిజమేనని, ఆ నలుగురు ఎవరో కాదని, సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జలరెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. బీసీల గుండెల్లో టీడీపీ అంటూ అంతకుముందు మరో బాబు మరో ట్వీట్ చేశారు.
జయహో బీసీ సభలో జగన్ మాట్లాడుతూ తన హృదయంలో బీసీలున్నారని, మూడున్నర సంవత్సరాల కాలయంలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించామని, తనవెనక ఉన్న నలుగురు మీరే అంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదలని జగన్ అభివర్ణించారు. దీనిపై చంద్రబాబు ట్వీట్ చేశారు.
గుంటూరులో హత్యకు గురైన వైద్య విద్యార్థిని తపస్వి తల్లిదండ్రులను పరామర్శించినట్లు చంద్రబాబు ట్విట్టర్ లో తెలిపారు. కుమార్తె మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు సీతారత్నం, పి.మహేష్ కుమార్తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పానని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బాబు డిమాండ్ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందిన వార్త తనను కలిసివేసిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.
చంద్రబాబు పొన్నూరులో జరిగిన 'ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొన్నారు. 9న చీరాల, 10న బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 10వ తేదీన ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎస్సీ నేతలు, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.