ఢిల్లీలో సీఎం జగన్ - ప్రధానితో భేటీలో : ఆ సమావేశాల్లోనూ కీలకంగా..!!
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు..రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధానితో భేటీ ఈ పర్యటనలో కీలకం కానుంది. ప్రధాని మోదీతో భేటీ సమయంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలు చర్చకు రానున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల పైన చర్చించనున్నారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పైనా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎన్నో సార్లు కేంద్రానికి నివేదించారు.
ప్రధానితో భేటీ సమయంలో
కొద్ది రోజుల క్రితం పోలవరం ముంపు గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటించిన సమయంలో ఈ అంశాన్ని తాను మరోసారి ప్రధానికి వివరిస్తానని చెప్పారు. దీంతో..ఈ రోజు సమావేశం ఈ అంశం పైన ప్రధానితో చర్చించి...హామీ పొందే అవకాశం ఉంది. వీటితో పాటుగా.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని.. దీనిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రిని కోరనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని, భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు మంజూరు చేయాలని, ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కూడా సీఎం జగన్ కోరనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర మంత్రులతోనూ కీలక భేటీలు
అనంతరం అపాయింట్మెంట్లను అనుసరించి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలతో భేటీ కానున్నారు. అదే విధంగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్.. జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఇతర కేంద్ర మంత్రులతోనూ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. ఈ రాత్రికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో రాజకీయ అంశాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాజకీయ అంశాలపై క్లారిటీ
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని - టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య పలకరింపుల అంశం.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు .. పొత్తుల పైన అంచనాలకు కారణమైంది. ఇక, ఏపీలో ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. అందులో భాగంగా..కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం పైన కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో..ముఖ్యమంత్రి జగన్ తాజా ఢిల్లీ పర్యటన ఏపీ పాలనా పరంగా ..రాజకీయంగా కీలకం కానుంది.