కెసిఆర్లో కోస్తా రక్తం, సమైక్యవాదిగా: టిజి వెంకటేష్
రాజ్యాధికారం కోసమే కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని ఆయన విమర్శించారు. తాను సమైక్యవపాదినే అని ఆయన మరోసారి చెప్పారు. రాయల తెలంగాణ వల్ల రాయలసీమ ఇబ్బందులు కొద్గిగానే తగ్గుతాయని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని ఆయన అన్నారు.
కర్నూలును రాజధానిగా చేస్తే రాయల తెలంగాణ ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే అన్నీ ఇబ్బందులే ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందితే కోర్టులు కూడా ఆపలేవని ఆయన స్పష్టం చేశారు. రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమని ఆయన చెప్పారు. విభజన జరిగితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఏం చేస్తారో చెప్పాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన ఆగాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్, చంద్రబాబు కలిసి పోరాడాలని అన్నారు. రాయల తెలంగాణ అనేది జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయం మాత్రమేనని, అందరి అభిప్రాయం కాదని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వస్తే తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పడుతుందని తాను నమ్ముతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. శానససభ సమావేశాలను డిసెంబర్ 9వ తేదీన నుంచి నిర్వహించాలని వ్యక్తిగతంగా తాను అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచారని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ మాదిరిగా తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పదవి కోసం ఆరాటపడడం లేదని ఆయన అన్నారు.