నగరంలో ఫ్యామిలీ పాలిటిక్స్, సుష్మిత కూడా (పిక్చర్స్)
హైదరాబాద్: వంశపారంపర్య రాజకీయాల పైన ఆమ్ ఆద్మీ (ఎఎపి) వంటి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా వాటిని తప్పు పడుతున్నారు. అయినప్పటికీ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు సాధారణమైపోయాయి.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పలు రాజకీయ పార్టీల నుండి నేతలు, వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా కాంగ్రెసు పార్టీ నుండి మాజీ మంత్రులు ముఖేష్ గౌడ్, శంకర రావు, సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మెదక్ జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి, టిడిపిలో నగరం నుండి దేవేందర్ గౌడ్, దివంగత పిజెఆర్ కుటుంబ సభ్యులు బరిలోకి దిగనున్నారు.
అంజన్ కుమార్ యాదవ్
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009లలో సికింద్రాబాద్ నుండి కాంగ్రెసు తరఫున పోటీ చేసి గెలిచారు. మూడోసారి ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే, తన తనయుడు అనిల్ కుమార్ యాదవ్ను ముషీరాబాద్ నియోజకవర్గం నుండి నిలబెట్టాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖేష్ గౌడ్
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన తనయుడు విక్రమ్ గౌడ్ను ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు కాంగ్రెసు నగర కాంగ్రెసు నేతలు ముషీరాబాద్ పైన దృష్టి సారించడం గమనార్హం.
శంకర రావు
మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యులు శంకర రావు కూడా తన కూతురు సుష్మితను ఎన్నికల బరిలో దింపాలని ఉత్సుకత చూపిస్తున్నారు. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న కంటోన్మెంట్ బరిలో సుష్మితను దింపాలని చూస్తున్నారు. అయితే, అతను నాగర్ కర్నూలు లోకసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఖాయమైతే, అధిష్టానం ఒప్పుకుంటే సుష్మితను కంటోన్మెంట్ నుండి బరిలోకి దింపే అవకాశముంది.
సబితా ఇంద్రా రెడ్డి
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తన తనయుడు కార్తీక్ రెడ్డిని చేవెళ్ల లోకసభ బరిలో దింపాలని యోచిస్తున్నారు. ఆమె కూడా నియోజకవర్గం మారే అవకాశాలు ఉన్నాయట.
పిజెఆర్
పిజెఆర్ తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున జూబ్లిహిల్స్ నుండి, ఆయన సోదరి విజయా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఖైరతాబాద్ నుండి పోటీ చేయనున్నారు.
దేవేందర్ గౌడ్
టిడిపి సీనియర్ రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్ తన తనయుడు వీరేందర్ గౌడ్ను ఉప్పల్ బరిలో దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.