సీఎం జగన్ చుట్టూ హుజూరాబాద్ రాజకీయం... గెలిచేదెవరు?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తెలంగాణలో హుజూరాబాద్ బై పోల్. ఈ రెండింటికీ ఇప్పుడు పెద్ద లింక్ ఏర్పడింది. డైరెక్ట్ గా చూస్తూ జగన్ -హుజూరాబాద్ బై పోల్ కు ఎటువంటి సంబంధం కనిపించదు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్..బీజేపీ అభ్యర్ధి ఈటల..టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఇప్పుడు జగన్ పేరు కీలకంగా మారింది. తెలంగాణలో కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా మంత్రులు...నేతలు జల దోపిడీకి దిగుతు న్నారంటూ ఆరోపణలు చేసారు. ఏపీ ప్రభుత్వం సైతం స్పందించింది. అదే విధంగా దివంగత సీఎం వైఎస్ పైన తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి.
ఉప ఎన్నిక- టార్గెట్ జగన్...
ఇవన్నీ హుజూరాబాద్ ఎన్నికల ముందు సెంటిమెంట్ కోసమే చేస్తున్న వ్యాఖ్యలనే వాదన విపిపించింది. తాజాగా..సీఎం కేసీఆర్ సైతం ఆంధ్రా వాళ్లు దాదాగిరి చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్ధిగా గతంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయి.. కొద్ది రోజుల క్రితం రేవంత్ పైన తీవ్ర విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ -బీజేపీకి టార్గెట్ అవుతున్నారు. అందుకు కారణం...నాడు జగన్ ఓదార్పు యాత్ర సమయంలో తెలంగాణ ఉద్యమ కారుల పైన రాళ్ల దాడి ఘటనలో ఉన్నారనేది ప్రధాన ఆరోపణ.
జగన్-మానుకొండ ఘటన- ఏం జరిగింది..
తన తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆదుకొనేందుకు జగన్ నాడు ఓదార్పు యాత్ర నిర్వహించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓదార్పు యాత్రలో భాగంగా..వైఎస్ జగన్ 2010 మే 28వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ లో మహబూబాబాద్ పర్యటనకు బయలుదేరారు. ఆయనను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్ కు స్వాగతం చెప్పడానికి వచ్చిన ఆయన అనుచరులకు, తెలంగాణ ఉద్యమకారులకు మధ్య ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ మద్దతు దారులు వర్సెస్ ఉద్యమ కారులు..
ఈ కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. ఘర్షణలు జరగటంతో అక్కడి నుంచే జగన్ ను అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ ఘటనలో అప్పటి కాంగ్రెసు నాయకులు కొండా మురళి, కొండా సురేఖ, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పుల్లా భాస్కర్, పుల్లా పద్మావతి, నాయిని రాజేందర్ రెడ్డి, రెడ్యా నాయక్, మాలోతు కవితలపై కేసు నమోదైంది. ఆ కేసును అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడికి బదిలీ చేసింది. లోక్ సభలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించిన కారణంగా..జగన్ తెలంగాణకు వ్యతిరేకమంటూ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు.
మానుకొండ ఘటన ప్రచార అంశంగా..
ఇప్పుడు ఈటెల రాజేందర్ దీనిని గుర్తు చేస్తూ...నాడు ఉద్యమకారుల పైన దాడి చేసిన కౌశిక్ కు ఎమ్మెల్సీ ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా..రేవంత్ సైతం కౌశిక్ గురించి కేసీఆర్ ను నిలదీసేందుకు సిద్దం అవుతున్నారు. ఇలా జగన్ తెలంగాణ వ్యతిరేకిగా చెబుతూ..నాటి పరిణామాలను-ఘటనలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ - బీజేపీ ఇప్పుడు హుజారాబాద్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగిస్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ నేతలు నీటి పంపకాలు...ప్రాజెక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం పైన ఆరోపణలు కొనసాగిస్తోంది.
ఆంధ్రా వాళ్ల దాదాగిరీ అంటూ కేసీఆర్..
తెలంగాణ రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోబోమని..పొరుగు రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటూ..వారితో సత్సంబంధాలు కొనసాగించటమే తమ విధానమని జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ మాత్రం జగన్ నాటి ఓదార్పు యాత్ర ..నేటి రాయలసీమ ఎత్తిపోతల అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక, ఇదే సమయంలో షర్మిల సైతం తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా..అంగీకరించమని చెబుతున్నారు.
షర్మిలకు సైతం టార్గెట్ గా..
చుక్క నీటిని కూడా వదులుకోమని చెబుతూ పరోక్షంగా తన అన్న జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే అన్న ప్రభుత్వంతోనూ పోరాడుతానని గతంలోనే చెప్పారు. జగన్ ప్రభుత్వం పైన ఎంతగా ఫైర్ అవుతే..అంతగా షర్మిల పార్టీ రాజకీయంగా మైలేజ్ సాధించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో...ఏపీ సీఎం జగన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు..అందునా హుజూరాబాద్ బై పోల్ లో కీ ఫ్యాక్టర్ గా మారుతున్నారు. మరి...ఎవరికి వారు తమకు అనుకూలంగా చేసుకుంటున్న ప్రచారం ఎవరికి అడ్వాంటేజ్ గా మారుతుందనేది మాత్రం ఎన్నికల ఫలితాలతో వెల్లడి కానుంది.