జనసేనకు తెలియకుండా లీకులిస్తున్న బీజేపీ?
తాము జనసేన పార్టీతో పొత్తులోనే ఉన్నామని భారతీయ జనతాపార్టీ నేతలు చెబుతుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తామిద్దరి మధ్య కరోనా వల్ల భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గిపోగానే అది కూడా తగ్గిపోతుందని చెప్పారు. చంద్రబాబుతో కలిసి పవన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాత్రం బీజేపీ నేతలు హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తామిద్దరం పొత్తులోనే ఉన్నామని మరోసారి నొక్కి వక్కాణించారు.
పవన్ కల్యాణ్ కు మిత్రపక్షంగా ఎప్పుడు గౌరవమిచ్చారు?
రాష్ట్రంలో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. బీజేపీ తన కార్యక్రమాలు సొంతంగానే నిర్వహించుకుంటూ వస్తోంది. గోదావరి గర్జనకుకానీ, మోడీ పర్యటనలకుకానీ, అమరావతి గ్రామాల్లో పాదయాత్రకు కానీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారా? లేదా? అనేది ఇప్పటికీ సందేహాస్పదంగానే మిగిలిపోయింది. దీనిపై ఇరుపార్టీలు మాట్లాడటంలేదు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కల్యాణ్ ఘంటాపథంగా చెబుతున్నారు. అవసరమైతే పొత్తులతో అందరినీ కలుపుకొని వెళతానని చెప్పిన తర్వాత బీజేపీ ఉలిక్కిపడింది. తన మిత్రపక్షానికి ఇంతవరకు ఎటువంటి మర్యాదకానీ, గౌరవం కానీ ఇవ్వని నేతలు ఆఘమేఘాలమీద పవన్ ను కలిశారు.
మోడీ రోడ్ మ్యాప్ నచ్చలేదా?
విశాఖపట్నం పర్యటనకు వచ్చిన నరేంద్రమోడీతో పవన్ కల్యాణ్ 30 నిముషాల భేటీ జరిపారు. మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారని, ఆ ప్రకారమే పవన్ ముందుకు వెళుతున్నారంటూ బీజేపీ ప్రచారం చేసింది. మోడీని కలిసి మొదటి నాలుగు రోజుల వరకు మాములుగానే ఉన్న పవన్ మళ్లీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటించారు. ప్రధానమంత్రి కానీ, బీజేపీకాని ఇచ్చిన రోడ్ మ్యాప్ నచ్చలేదని, దానివల్ల జనసేనకు ఎటువంటి ప్రయోజనం లేదనేది జనసేనాని భావనగా ఉందంటూ వార్తలు వచ్చాయి.
బీజేపీకి దూరంగా ఉండాలా? దగ్గరగా ఉండాలా?
భారతీయ జనతాపార్టీకి దూరంగా ఉండాలా? దగ్గరగా ఉండాలా? అన్నది పవన్ కల్యాణ్ తేల్చుకోలేకపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో తమ పార్టీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఆయనలో కనపడటంలేదని, అందుకే బీజేపీ నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ సానుకూలంగా స్పందించలేకపోతున్నారు. చాలారోజుల తర్వాత బీజేపీ-జనసేన నేతల మధ్య భేటీ జరగబోతోందని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని జనసేన తేల్చేసింది.
పొత్తుల ప్రస్తావనే ఉండదు..
సుపరిపాలన అనే అంశంపై మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినం సందర్భంగా విజయవాడలో జరుగుతున్న సమావేశానికి జనసేన వస్తోందంటూ బీజేపీ నేతలు మీడియాకు లీకులిచ్చారు. అయితే జనసేన వీటిని కొట్టిపారేసింది. సమన్వయకమిటీ సమావేశమేదీ జరగడంలేదని స్పష్టం చేసింది. బీజేపీ నిర్వహించే సభకు తమ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపిస్తున్నామని, అందులో రాజకీయాలుకానీ, పొత్తుల గురించి కానీ ప్రస్తావన ఉండదని జనసేన తేల్చేసింది. కమిటీలకు, సమావేశాలకు తొందరేం లేదనేది జనసేన భావనగా ఉంది. మున్ముందు ఈ పార్టీతో స్నేహం చేయాలంటేనే జనసేన ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.