ఈ ఏడాదీ పట్టిసీమే గతి - ఖరీఫ్ గండం దాటాలంటే మరోసారి గోదావరివైపే కృష్ణానది చూపు
కృష్ణాడెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాలంటే గోదావరి నదీ జలాలపై తప్పనిసరిగా ఆధారపడాల్సిన పరిస్దితులు ఉన్నాయి. డెల్టాలో ఆయకట్టు సాగు కోసం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందితేనే ఈసారి ఖరీఫ్ ప్రారంభించేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గోదావరిలోనూ 14 అడుగుల నీటి మట్టం పెరిగితేనే పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి.
మరోసారి పట్టిసీమే ఆధారం....
కృష్ణానది ఎగువన వరద ప్రభావం ప్రారంభం కాకపోవడం, గతేడాది తరహాలో ఈసారి భారీగా వరద ప్రవాహం ఉండబోదన్న అంచనాల మధ్య డెల్టా రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కోసం పట్టిసీమ వైపే ఎదురుచూడాల్సిన పరిస్ధితి నెలకొంది. గతేడాది కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి నీరు ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఈసారి పరిస్ధితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో పట్టిసీమ ప్రాజెక్టే ఆధారం కానుందనే అంచనాలున్నాయి.
గోదావరిలో నీళ్లు వచ్చాకే...
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే అక్కడ గోదావరి నీళ్లు 14 అడుగులు ఉండాల్సిందే. కాబట్టి గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుదల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గోదావరి తూర్పు డెల్టాకు నీటి విడుదల ప్రారంభమైంది. జూన్ నాలుగో వారం కల్లా గోదావరిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో పట్టిసీమ లిఫ్ట్ ద్వారా నీటి విడుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గోదావరి ఇన్ ఫ్లో పెరిగినా...
గోదావరి నదిలో ప్రస్తుతం ఇన్ ఫ్లో ఏడున్నర వేల క్యూసెక్కులుగా ఉంది. పై నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి ఇది 20 వేల క్యూసెక్కులకు పెరిగినా పట్టిసీమ ద్వారా నీటి విడుదలకు అధికారులు చర్చలు జరుపుతున్నారు. గోదావరి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడం ద్వారా కృష్ణాడెల్టాను ఖరీఫ్ సీజన్ లో ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు.