ఎంపి కొత్తపల్లి గీతకు స్వైన్ ఫ్లూ: గాంధీ ఆస్పత్రిలో ఖైదీ మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. విశాఖపట్నం జిల్లా అరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గీత ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యే అవకాశం ఉంది.
కాగా, సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఓ ఖైదీ స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించాడు. హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఇద్దరు ఖైదీలు స్వైన్ఫ్లూతో బాధపడుతుండగా ఓ ఖైదీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తోటి ఖైదీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మృతుడు ఓ హత్య కేసులో నిందితుడు.
విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నాలుగుకు చేరుకున్నాయి. విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విస్తరిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ప్రతి రోజూ ఇద్దరి చొప్పున మరణిస్తున్నారు. హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రిలో ఒకరికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు కూడా స్వైన్ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు.
స్వైన్ఫ్లూ వ్యాధి నివారణ చర్యలపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. ఏలూరులోని స్థానిక న్యూ అశోక్నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సునందతో జిల్లాలో స్వైన్ఫ్లూ వ్యాధి నివారణ చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ స్వైన్ఫ్లూ వ్యాధి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అదుపులో ఉందని, ఈ విషయంలో ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యంగా సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, జాతల ప్రదేశాలలో అత్యధిక సంఖ్యలో గుమిగూడి వున్న సందర్భాలలో ప్రజలు ముక్కుకు ప్రత్యేకంగా మాస్క్లు ధరించాలని దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండబోదని చెప్పారు. ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా స్వైన్ఫ్లూ వంటి వ్యాధులను దూరంగా ఉంచవచ్చని చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుండి ఇంత వరకు మొత్తం 65 స్వైన్ఫ్లూ అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుండి నమూనాలు సేకరించి పరీక్షించగా 32 మందికి వ్యాధి శోకినట్లు నిర్ధారణ జరిగిందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాక వీరికి సకాలంలో వైద్య సేవలు అందించడంతో ఆరోగ్యంగా ఉన్నారన్నారు. స్వైన్ఫ్లూ నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందని, ఆయుర్వేద, హోమియోపతి మందులను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
స్వైన్ఫ్లూ వ్యాధికి సంబంధించి డాక్టర్ కళ్యాణ్ను జిల్లాకు మోడల్ అధికారిగా నియమించామని, స్వైన్ఫ్లూ అనుమానాలున్న వారు నోడల్ అధికారి ఫోన్ నెంబరు 97005 08408, 08812-222367కు సమాచారం అందించవ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ సునంద చెప్పారు. జిల్లాలో ఇంత వరకూ మూడు స్వైన్ఫ్లూ కేసులు నమోదుఅయ్యాయని వాటిలో జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఇద్దరు, తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లికి చెందిన ఒకరు ఈ వ్యాధికి గురయ్యారని, వైద్యసేవలు అందిన తరువాత వారు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.