కిరణ్ రిజైన్ చేస్తేనే, సిఎం పదవిని ఎవరు కోరుకోరు: టిజి
కర్నూలు జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకటేష్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదన్నారు. ఆయన తనంతట తాను రాజీనామా చేస్తే తప్ప మార్చలేరన్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు ముందుకు రారని చెప్పారు. తెలంగాణను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు.
విభజనపై అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తానని ముఖ్యమంత్రి తమకు చెప్పారని తెలిపారు. విభజన తప్పనిసరి అయితే రాయలసీమకు న్యాయం జరగాలంటే ఆలంపూర్, గద్వాల ప్రాంతాలను కర్నూలులో కలపాలని డిమాండ్ చేశారు.
బిల్లు వచ్చే అవకాశం: గంటా
తెలంగాణ బిల్లు ఈ నెలలోనే శాసన సభకు వచ్చే అవకాశముందని మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటులో పెట్టకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీకి ఎలా పంపుతారో చెప్పాలన్నారు. ఈ నెల 24న విశాఖలో జరగనున్న భారత్ - వెస్టిండీస్ వన్డేను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా మంత్రి రఘువీరా రెడ్డికి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సమైక్య సెగ తగిలింది. పలువురు ఉద్యోగులు మంత్రిని అడ్డుకున్నారు. రఘువీరా కారు దిగి సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు.
ప్రధానితో కేంద్రమంత్రుల భేటీ రద్దు
ప్రధాని మన్మోహన్ సింగ్తో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ రద్దు అయింది. మరోసారి కేంద్ర మంత్రులకు సమయమిస్తామని పిఎంవో వర్గాలు వెల్లడించాయి. తమ ప్రాంతానికి న్యాయం చేయాలంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు పలువురు ఢిల్లీ పెద్దలను కలుస్తున్న విషయం తెలిసిందే.