AP Weather : ఏపీకి ఆరెంజ్ అలర్ట్- ఆ నాలుగు జిల్లాల్లో కుండపోత-వాతావరణ శాఖ హెచ్చరికలు
వరుస వర్షాలతో అతకాకుతలం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ విభాగం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఇదే కోవలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాదు దీని ప్రభావంతో నాలుగు జిల్లాల్లో భారీవర్షాలు తప్పవని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ జిల్లాల్లో తాజాగా ఏర్పడిన వాయుగుండాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీనష్టం వాటిల్లింది . దాన్నుంచి కోలుకోకముందే ఇవాళ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఇది తరువాత తుఫానుగా మారొచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది డిసెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా. పశ్చిమ బెంగాల్పై ప్రభావం చూపుతుందని హెచ్చరికలు జారీ చేస్తోంది. తుపాను పరిస్ధితుల నేపథ్యంలో మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్ధితిని బట్టి జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు కోసం కూడా అధికారులు సిద్దమవుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా ఏపీకి ఏటా తుపానుల గండం తప్పడం లేదు. తాజాగా ఏర్పడిన తుఫానులతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వాటి నుంచి జనం ఇంకా బయటపడనేలేదు. నష్టం అంచనా కూడా వేయలేదు. అప్పుడే మరో తుపాను ఏర్పడనున్నట్లు ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వరుస అల్పపీడనాల నేపథ్యంలో ఏపీలో విపత్తుల నివారణ విభాగం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా జిల్లాల్లో క్షేత్రస్ధాయి సిబ్బందిని ఎలాంటి పరిస్ధితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచాలని ఉన్నతాధికారుల నుంచి అలర్ట్ లు వెళ్తున్నాయి. ఈసారి అల్పపీడనం తుపానుగా మారే ప్రమాదం కూడా ఉన్నందున ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.