చంద్రబాబుకు భారీ షాక్- బీజేపీకి బూస్ట్- పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ వ్యాఖ్యల వెనుక?
ఏపీలో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో తెలియని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఒకప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేయకుండా మద్దతుకే పరిమితమైన జనసేన... ఆ తర్వాత విడిగా పోటీ చేసినా టీడీపీ మిత్రపక్షంగానే విమర్శలు ఎదుర్కొని రాజకీయంగా గత సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయింది. అనంతరం బీజేపీతో పొత్తు కుదుర్చుకుని అప్పుడప్పుడూ వారితో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్.. తాజాగా టీడీపీతో మళ్లీ జత కడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై స్పందించే క్రమంలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు... చంద్రబాబుకు భారీ షాకివ్వగా... బీజేపీని సంతోషంలో నింపాయి.
Recommended Video
పవన్ గందరగోళం
ఏపీలో 2009లో ప్రజారాజ్యంలో భాగంగా రాజకీయ అరంగేట్రం చేసి, అనంతరం 2014లో జనసేనతో సొంతంగా రాజకీయ ప్రస్ధానం ప్రారంభించిన పవన్ కళ్యాణ్... ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటికి మాత్రం దూరంగా ఉండిపోయారు. రాజకీయ పార్టీ లక్ష్యమే ఎన్నికలైనప్పుడు వాటికే దూరంగా ఉండిపోవడమేంటన్న ప్రశ్నలకు జవాబు లేదు. అనంతరం టీడీపీతో పొత్తు నుంచి బయటికి వచ్చి సొంతంగా పోటీ చేసినా టీడీపీతో పరోక్ష పొత్తు విమర్శలు ఎదుర్కొన్న జనసేనాని... వాటికి దీటుగా సమాధానం చెప్పలేకపోయారు.
ఆ తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకుని విడివిడిగా పోరాటాలు చేస్తున్న పవన్... బీజేపీ తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరు ప్రారంభించి మరో గందరగోళానికి తెరదీశారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటారంటూ సర్వత్రా ప్రచారం జరుగుతున్న వేళ.. మళ్లీ భారీ ట్విస్ట్ ఇచ్చి బీజేపీతో పొత్తులో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా ఇతర పార్టీల మైండ్ గేమ్ లో పడొద్దంటూ తన కార్యకర్తలకు హితవు పలికారు.
పవన్ మైండ్ గేమ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఇతర పార్టీల మైండ్ గేమ్ లో పడొద్దంటూ కార్యకర్తలకు చెప్పారు. దీని వెనుక ప్రధాన కారణం టీడీపీతో పొత్తుపై జరుగుతున్న ప్రచారమే. తద్వారా టీడీపీ తన పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చెప్పకనే చెప్పేశారు.
చంద్రబాబు తాజాగా జనసేనతో లవ్ లో ఉన్నానని, తిరిగి ఆ పార్టీ లవ్ చేయకపోవడంతో వన్ సైడ్ లవ్ చేయాల్సి వస్తోందన్నారు. దీనిపై స్పందిస్తూ ఆయన ఇతర పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబుకు భారీ షాకే ఇచ్చారు.
చంద్రబాబుకు పవన్ వరుస షాకులు
ప్రధాన విపక్షంగా ఉంటూ వైసీపీపై పోరాడుతున్న టీడీపీకి ఇతర విపక్షాల నుంచి సహకారం కరువవుతోంది. దీనికి కారణం ఎవరి అజెండాలు వారికి ఉండటమే. ఇదే క్రమంలో అనూహ్యంగా అమరావతి రాజధాని అజెండాపై టీడీపీకి ఇతర విపక్షాలైన జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. అమిత్ షా సూచనతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు అమరావతి పాదయాత్రకు, రైతుల సభకు మద్దతు పలికారు.
దీంతో జనసేన కూడా తమ స్టాండ్ అదేనని చెప్పేందుకు తమ ప్రతినిధిని కూడా రైతుల సభకు పంపింది. అయితే చంద్రబాబు, సీపీఐ నారాయణ హాజరైన ఈ సభకు పవన్ కళ్యాణ్ మాత్రం దూరంగా ఉండిపోయారు. తద్వారా తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే బీజేపీతో కలిసి సాగుతూనే ఆ పార్టీ తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరాడుతున్న పవన్.. తాజాగా ఇతర పార్టీల మైండ్ గేమ్ లో పడొద్దంటూ కార్యకర్తలను కోరడం ద్వారా చంద్రబాబుకు మరో షాకిచ్చారు.
పవన్ నిర్ణయాలతో బీజేపీ హ్యాపీ
పవన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో గతంలో జనసేన-బీజేపీ పొత్తు కొనసాగడంపై కమ్ముకున్న నీలినీడలు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. గతంలో ఓ దశలో బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉండిపోతూ, విడివిడిగా జనసేన కార్యక్రమాలు రూపొందించుకున్న పవన్... ఆ పార్టీ తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరు ప్రారంభించారు. అయినా బీజేపీని పల్లెత్తుమాట అనకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తమతో పొత్తు కోరుకుంటున్నా బీజేపీతో మిత్రభేదానికి పవన్ సిద్దం కావడం లేదు. దీంతో పవన్ నిర్ణయాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ తప్పు చేస్తున్నారా?
రాజకీయంగా ఇప్పటికే పలు తప్పటడుగులు వేసిన జనసేనాని పవన్ తన తాజా వ్యాఖ్యలతో మరోసారి తడబాటును, అనుభవరాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో వైసీపీతో పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీకే పట్టు చిక్కడం లేదు. అలాంటిది టీడీపీతో పోలిస్తే క్షేత్రస్ధాయిలో అంతంతమాత్రంగా ఉన్న జనసేన భవిష్యత్తులో రాణించాలంటే సొంతంగా బలపడాలి లేదంటే కనీసం క్షేత్రస్దాయిలో క్యాడర్ బలం కలిగిన పార్టీలతో జత కట్టక తప్పదు.
ఈ రెండూ చేయకుండా తన కంటే క్యాడర్ బలం తక్కువగా ఉన్న బీజేపీతో కలిసి ముందుకు సాగడం భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా వైసీపీపై బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడిగా పోరాడుతున్న దాఖలాలే కనిపించడం లేదు. అలాంటి పరిస్ధితుల్లో రాజకీయంగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలపై మరోసారి చర్చ జరుగుతోంది.