లాక్కోవద్దు.. అంతే, నిరాహార దీక్ష చేస్తా, వైయస్కు బాబుకు తేడా ఏంటి: పవన్
పెనుమాక: చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే తాను ఖచ్చితంగా ధర్నా చేస్తానని, నిరాహార దీక్ష చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భూకుంభకోణాలు జరిగాయని, ఇప్పుడు చంద్రబాబు అలాగే చేస్తే మీకు, ఆయనకు తేడా ఏమిటని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ పెనుమాక గ్రామంలో రైతులను సమస్యలు అడిగిన తర్వాత సుదీర్ఘంగా మాట్లాడారు. వైయస్ హయాంలో ఎన్నో భూకుంభకోణాలు జరిగాయన్నారు. వాన్ పిక్ అందుకు మంచి నిదర్శనం అన్నారు.
నాడు వాన్ పిక్ భూముల గురించి మాట్లాడమని ఎన్నికల సమయంలో టిడిపి నేత కరణం బలరాం చెప్పారని, ఇప్పుడు మీరు అదే భూసేకకణకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. వారు చేసిన తప్పే మీరు చెస్తే ఎలా అన్నారు.
చట్టపరమైన రక్షణ మాకు కల్పిస్తే మేం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు రైతులు చెబుతున్నారని, వారు ఇస్తే తీసుకోవద్దన్నారు. రానున్న కాలంలో ఆహార భద్రత చాలా పెద్ద సమస్య అని, భూమిని చంపుకుంటే మరింత కష్టమన్నారు.
తనకు కులాభిమానం లేదు.. కులాలపై అవగాహన ఉంది
భారత దేశం కులాలతో కూడుకున్నదన్నారు. తనకు కులం ఆపాదించవద్దన్నారు. కులాల కోసం కొట్లాట తీసుకు రావదన్నారు. తాను ఆచితూచి మాట్లాడుతున్నానని చెప్పారు.
ప్రత్యేక ప్యాకేజీ
ప్రత్యేక ప్యాకేజీ కోసం చిత్తశుద్ధితో అడగాలని తాను టిడిపి నేతలను కోరానని చెప్పారు. మంత్రి యనమల రామకృష్ణుడికి తాను విజ్ఞప్తి చేశానని, ఘాటుగా స్పందించలేదన్నారు. కానీ ఆయన మాత్రం ఎలా మాట్లాడారో చూశారన్నారు.
నాకు సినిమాల ద్వారా వచ్చిన ఆనందం చాలని, కానీ భారతీయుడిగా నేను ఏం చేయాలనుకున్నానో అది చేసేందుకు పార్టీ పెట్టానని చెప్పారు.
సలహా అడగలేదు తప్పుపట్టను
తన సలహాలు, సూచనలు తీసుకుంటానని టిడిపి చెప్పిందని, కానీ నేను అడగందే నా కొడుక్కి కూడా సలహాలివ్వనని చెప్పారు. తనను వారు రాజధాని విషయమై సలహాలు అడగలేదని, దానిని నేను తప్పుపట్టనని చెప్పారు.
అయితే, తనకు అనుభవం లేదు కాబట్టి నేను దానిని తప్పుపట్టనని చెప్పారు. కానీ లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ, ఇతర రిటైర్డ్ ప్రొఫెసర్లను ఎందుకు అడగడం లేదన్నారు.
లాక్కోవద్దు.. లాక్కోవద్దు..
ఇష్టపడి ఇస్తే తీసుకోవచ్చునని కానీ, రైతులు ఇవ్వమంటే ఎందుకు అడుగుతున్నారన్నారు. ఇవ్వనని చెప్పిన రైతుల నుంచి భూమిని లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు అని నేను చెబుతున్నానని అన్నారు. భూసేకరణ చేస్తే ఖచ్చితంగా ధర్నా చేస్తానని చెప్పారు.
టిడిపి ప్రభుత్వం బలవంతంగా భూమిని సేకరిస్తే కుదరదన్నారు. ఆనందంతో కట్టే రాజధాని కావాలని, కన్నీళ్లు పెట్టే రాజధాని వద్దన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ భారతం కోరుకున్నారు. వెయ్యి అంతస్తుల భూమి పైన ఉన్నా తినేది రైతులు పండించే అన్నామే అన్నారు.
నాకు జగన్ సహా వ్యక్తిగతంగా శత్రువు లేరు
నాకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరన్నారు. తనకు జగన్ సహా ఎవరూ శత్రువుల కాదన్నారు. ప్రజల సమస్యల కోసం చావుకైనా సిద్ధమన్నారు. తనకు ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదన్నారు. నేను ఏ పక్షం అంటే.. ఏ పార్టీ పక్షం కాదని, జనం పక్షం అన్నారు. నేను గ్రామీణ భారతాన్ని కోరుకున్నానని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం తాను చావుకు కూడా సిద్ధమన్నారు.
2019లో ఒకవేళ టిడిపి అధికారంలో రాకుంటే..
ఒకవేళ టిడిపి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలో రాకుంటే.. రైతుల పరిస్థితి ఏమిటన్నారు. కీడెంచి మేలెంచాలని తాను చెబుతున్నానని, టిడిపి రాదని కాదని, ఒకవేళ రాకుంటే రైతుల పరిస్థితి ఏమిటని తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. వారికి రాజపత్రం ద్వారా ఇవ్వాలన్నారు.
రాజకీయాలు అంటే కొట్టుకోవడానికి కాదు.. మాట్లాడుకోవడానికి
రాజకీయాలు అంటే కొట్టుకోవడానికి కాదని, మాట్లాడుకోవడానికి అన్నారు. తాను చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని నమ్ముతానని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారం కాకుంటే అప్పుడు ప్రజలు వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు. దయచేసి భూసేకరణ వద్దన్నారు.
నిరాహార దీక్షకు సిద్ధం
హైదరాబాదు కట్టిన చంద్రబాబుకు, అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన చంద్రబాబుకు రాజధానికి భూసేకరణపై మధ్యే మార్గం కనిపించదా అన్నారు. భూమిని బలంతంగా లాక్కుంటే తాను నిరాహార దీక్షకు సిద్ధమని చెప్పారు. దయచేసి భూసేకరణ చేయవద్దని, కానీ భూసమీకరణకు రైతులను ఒప్పించుకోవచ్చన్నారు.
రైతుల పక్షాన మీకు అండగా ఉన్నానని, నేను ఎక్కడకు పారిపోనని, టిడిపి ఆలోచించాలని, రాజధాని అభివృద్ధికి నేను ఆటంకమే అయితే, మీకు ఎందుకు మద్దతిచ్చానో గుర్తు తెచ్చుకోవాలన్నారు.