నా చిరుతల్ని రక్షించండి ప్లీజ్- ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఆంధ్రా డాక్టర్ వేడుకోలు..
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై నెలలు గడుస్తోంది. దీంతో ఇప్పటికే భారత్ కు చెందిన పలువురు నిపుణులు, కార్మికులు అక్కడ ఉండలేక తిరిగి వచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో ఓ అత్యవసర పరిస్ధితుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ కూడా ఉక్రెయిన్ నుంచి ఉన్నపళంగా తిరిగి వచ్చేశారు. ఆ హడావిడిలో తాను పెంచుకుంటున్న రెండు పెంపుడు జంతువుల్ని అక్కడే వదిలి వచ్చేయాల్సి వచ్చింది.
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ గిడి కుమార్ ను అక్కడి సైన్యం యుద్ధ ప్రాంతం నుండి బలవంతంగా బయటకు పంపింది. దీంతో ఆయన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు. ఇప్పుడు అక్కడే మిగిలిపోయిన తన పెంపుడు జాగ్వర్, చిరుతపులిని రక్షించడంలో సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తన అసాధారణ పెంపుడు జంతువులను జాగ్వార్ కుమార్ అని పిలుస్తారని, తన "విలువైన పిల్లుల" ప్రాణాలను కాపాడటమే తన ముందున్న కర్తవ్యమని డాక్టర్ గిడికుమార్ పాటిల్ చెప్తున్నారు. ఈ చిరుతపులి, జాగ్వార్ రెండూ అరుదైన జాతికి చెందిన జంతువులని డాక్టర్ తెలిపారు.
42 ఏళ్ల డాక్టర్ గిడి కుమార్.. ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల అన్వేషణలో ఈ ప్రాంతంలో సంఘర్షణకు కేంద్రమైన తూర్పు ఉక్రెయిన్లోని లుహాన్స్క్ నుండి బయలుదేరినప్పుడు తన పెంపుడు జంతువుల్ని స్థానిక రైతు దగ్గర వదిలేసి వచ్చారు. కైవ్లోని భారత రాయబార కార్యాలయం సాయం చేయలేకపోవటంతో ఇక్కడికి చేరుకున్న తర్వాత కేంద్రానికి తనకు సాయం చేయాలని కోరుతున్నారు. తన పెంపుడు జంతువుల ప్రస్తుత పరిస్ధితి దృష్టిలో ఉంచుకుని వాటిని భారత్ కు తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ కోరారు.