సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్ : పూర్తిగా సహకరిస్తాం-అండగా నిలుస్తాం : సురక్షితంగా ఉండాలి...!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసారు. రాష్ట్రానికి గులాబ్ తుఫాన్ ముప్పు ఉందన్న హెచ్చిరకలతో రాష్ట్రంలో పరిస్థితుల పైన ఆరా తీసారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలోని గోపాల్పూర్కి 510 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ, దిశలో.. కళింగపట్నానికి తూర్పు, ఈశాన్య దిశలో 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ప్రస్తుతం వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుఫాన్ కొనసాగుతోంది. గోపాలపూర్కు 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 190 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల పైన ప్రభావం ఉండే అవకాశం ఉందని సీఎం ప్రధానికి వివరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ఈ అర్థరాత్రి గోపాల్పూర్-కళింగపట్నం మధ్య గులాబ్ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి.
ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో పలు రైళ్లను ముందు జాగ్రత్తగా రద్దు చేసారు. ఏపీ విపత్తు కమిషనర్ కన్నబాబు విశాఖలో మకాం వేసారు. రాష్ట్ర స్థాయిలో వెంటనే సహకారం అందించేందుకు కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదే సమయంలో సహాయక శిబిరాల ఏర్పాటు..ఆ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యల విషయంలో జాగ్రత్తలను పదే పదే సూచిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాస్ మూడు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా ఎస్డీఎఫ్ టీంలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోహరించాయి. అర్దరాత్రి తీరం దాటే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలతో అధికారుల తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.