చంద్రబాబు ఎదురుచూపుకు మోక్షం, మోడీతో భేటీతో అదీ తేలిపోనుంది
అమరావతి/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నారు. ఏడాదిగా ప్రధాని అపాయింటుమెంట్ కోరుతున్నప్పటికీ చంద్రబాబుకు దొరకలేదు. పైగా విభజన హామీలను నెరవేర్చడం లేదని ఏపీ సీఎం అసంతృప్తితో ఉన్నారు.
ఇటీవల ఎంపీలు ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో అపాయింటుమెంట్ లభించింది. అయితే, ఈ భేటీ ద్వారా 2019 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కలిసి ఉంటాయా లేదా అనే విషయం దాదాపు తేలిపోనుందని అంటున్నారు. భేటీ సంతృప్తికరంగా ఉంటే కలిసి నడిచే అవకాశాలు లేదంటే విడిపోయే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
రాజధానికి ఇవి సరిపోవు
మోడీతో భేటీ నేపథ్యంలో చంద్రబాబు ఏఏ అంశాలను చర్చిస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. విజ్ఞప్తుల కోసం ఏపీ అధికారులు పెద్ద కసరత్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. మరో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరు, భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి ఇచ్చారు. అన్నీ కలిపి రూ.2500 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది, ఇవి సరిపోవని, మరిన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరనున్నారు. అలాగే, ఈఏపీ కింద రూ.16,725 కోట్లు రావాల్సి ఉంది. వీటికి అనుమతించాలని అడుగుతున్నారు. ఈఏపీ ప్రాజెక్టుల కింద వచ్చే రుణాన్ని నాబార్డు నుంచి ఇప్పించాలని, ఆ రుణాన్ని తిరిగి కేంద్రం కట్టుకోవాలని సీఎం అడగనున్నారు.
పోలవరం ప్రాజెక్టు
వీటితో పాటు పోలవరం ప్రాజెక్టుకు రూ.58వేల కోట్లతో సమర్పించిన పూర్తి స్థాయి అంచనాల్ని ఆమోదించడం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించడం, రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచడంతోపాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాల్సిందిగా మోడీని చంద్రబాబు కోరనున్నారు.
వీటినీ చర్చిస్తారు
అలాగే, రాష్ట్ర విభజన చట్టంలో పన్నులకు సంబంధించి 50, 51, 56 సెక్షన్లను సవరించకుంటే రాష్ట్రానికి రూ.3200 కోట్ల నష్టం వాటిల్లుతుందని, వీటిని సవరించాలని సీఎం విన్నవించనున్నారు. ఉమ్మడి సంస్థల విభజన, ఢిల్లీలో ఏపీ భవన్ విభజన కొలిక్కి తేవాలని ప్రధానిని కోరనున్నారు. ఉన్నత విద్యా మండలి ఆస్తుల విభజన విషయంలో సుప్రీం తీర్పును అమలు చేయాలని కోరనున్నారు. 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల విభజనకు రెండు రాష్ట్రాలకు ఇచ్చిన సమయం అయిపోయింది. దీనిని కేంద్రమం పరిష్కరించాలని కోరనున్నారు.
ఏడాది తర్వాత
దాదాపు ఏడాది తర్వాత మోడీ - చంద్రబాబులు భేటీ అవుతున్నారు. చంద్రబాబు గురువారం రాత్రి 9.20కు విజయవాడ నుంచి బయలుదేరి, ఆ తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని, రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో జాప్యం జరగడం వల్ల రాష్ట్రం మరింత సమస్యల వలయంలో చిక్కుకుంటోందని ఇటీవల టీడీపీ ఎంపీలు ప్రధాని దృష్టికి తెచ్చారు. వెంటనే నెరవేర్చాల్సిన హామీలతో ప్రధానికి ఒక వినతి పత్రం సమర్పించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని తాను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతానని ఎంపీలకు తెలిపారు. మోడీతో భేటీ అనంతరం ఢిల్లీ నుంచి పుణేకు వెళ్లనున్నారు.