రఘురామరాజుకు జగన్ బిగ్ షాక్- కీలక భేటీకి దూరం పెట్టిన వైనం...
వైసీపీ తరపున గెలిచి ఆ పార్టీ నేతలు, ప్రభుత్వం నిత్యం విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ అధినేత, సీఎం అనూహ్యంగా షాక్ ఇచ్చారు. ఆయన కోరిన ఓ కీలక సమావేశానికే ఆయన్ను దూరం పెట్టారు. మిగతా ఎంపీలతో ఆ భేటీ నిర్వహించడం, రఘురామ రాజుకు ఆహ్వనం అందకపోవడంతో ఆయనకు ఇదో షాక్గా భావిస్తున్నారు.
పార్లమెంటు సమావేశాలకు ముందు రాజకీయ పార్టీలు తమ ఎంపీలతో వ్యూహాత్మక భేటీలు నిర్వహిస్తుంటాయి. కీలకమైన పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన అజెండా అంశాలపై అనుసరించాల్సిన వైఖరిపై తమ ఎంపీలకు అధినేతలు దిశానిర్దేశం చేస్తుంటారు. ఈ భేటీలు పార్టీ ఎంపీలకు ఓ గౌరవం కూడా. ఈ భేటీ ద్వారా ఎంపీలకు పార్టీ ఇస్తున్న గౌరవంతో పాటు పార్టీ వైఖరి కూడా స్పష్టమవుతుంటుంది. అలాంటి భేటీకి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు దూరమయ్యారు.
వైసీపీ ఎంపీలతో పాటు మిగతా పార్టీల ఎంపీలతో కూడా అఖిల భేటీ నిర్వహించి రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో వ్యూహం ఖరారు చేయాలని రఘురామరాజు తాజాగా సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రత్యేక హోదాతో పాటు అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని, అఖిల పక్ష భేటీ నిర్వహించడం ద్వారా ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని ఆయన జగన్ను లేఖలో కోరారు.
Recommended Video
అయితే రఘురామ కోరిన విధంగా జగన్ వర్చువల్ మీటింగ్ అయితే నిర్వహించారు కానీ అందులో పాల్గొనేందుకు రెబెల్ ఎంపీకి ఆహ్వానం అయితే అందలేదు. దీంతో ఆయన దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. చివరి నిమిషంలో నిర్వహించిన ఈ మీటింగ్లో పాల్గొనకుండానే ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు.