ఏపీలో ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల విచిత్ర పరిస్థితి .. పోలింగ్ కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది . ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీకి ముందే 100 మంది అభ్యర్థులు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు తేల్చడంతో రాజకీయ పార్టీలలో గందరగోళం నెలకొంది. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు సరిగ్గా వందమంది మృతి చెందినట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ఇక అభ్యర్థులు మరణించిన చోట తిరిగి నామినేషన్లు వేయడానికి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతే ఏడాది ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ .. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల లో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. 2020 మార్చి నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేసిన తర్వాత, కరోనా వ్యాప్తి కారణంగా అకస్మాత్తుగా ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. ఇక అప్పటినుండి ఈ ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు ఇప్పటివరకు 100 మంది మృతి చెందినట్లుగా తాజా సమాచారం.
అభ్యర్థులు 100 మంది మృతి .. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అభ్యర్థులపై ఆరా
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగాయి. రెండు ఎన్నికలు సజావుగా ముగిసాయి. దీంతో గత సంవత్సరం వాయిదాపడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇక పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై ఆరా తీసిన అధికారులు అప్పటినుండి ఇప్పటివరకు ఎంపీటీసీలుగా పోటీ చేసిన 87 మంది, జడ్పిటిసి అభ్యర్థులుగా బరిలోకి దిగిన 13 మంది చనిపోయారని అధికారికంగా నిర్ధారించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఎనిమిది మంది ఎంపీటీసీలు , ఒక జడ్పీటీసీ మృతి
ఇక ఈ జాబితాలో ఎనిమిది మంది ఎంపీటీసీలు, ఒక జెడ్ పి టి సి ఏకగ్రీవమైన వారిలో ఉన్నారు. ఎన్నికల బరిలోకి దిగిన అన్ని పార్టీల నుండి అభ్యర్థులు మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి నిలిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుందని తెలుస్తుంది.
చనిపోయిన చోట ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్న ఎస్ఈసి .. గందరగోళంలో రాజకీయ పార్టీలు
స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట ఈ అవకాశం ఉండదని వారంటున్నారు. ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోయిన చోట ఏం నిర్ణయం తీసుకోవాలన్న దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గత సంవత్సరం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులలో 100 మంది చనిపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలను గందరగోళంలోకి నెట్టేసింది. ఇప్పటివరకు గ్రామ పంచాయితీ మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది తెలియాల్సి ఉంది.