బల్లగుద్ధి చెప్తున్నా: సుజన, 'రివర్స్' అటాక్.. రాజధానిపై బొత్స కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ/విజయవాడ: సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు, వైసిపి నేతలు చేస్తున్న విమర్శల పైన టిడిపి ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి శుక్రవారం స్పందించారు. ఈ భూదందా అని ఆరోపణలు చేసి విచారణ జరిపించమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తనకు ఎకరం భూమి లేదని, ఆధారాల్లేకుండా ఆరోపణ సరికాదన్నారు.
ఈ అంశం పైన విచారణ అవసరమా లేదా అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం తాను ఎలాంటి భూములు కొనలేదని చెప్పారు. ఈ విషయాన్ని నేను బల్లగుద్దీ మరీ చెబుతున్నానన్నారు. విమర్శల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
సుజనా చౌదరికి సుప్రీం కోర్టులో చుక్కెదురు
కేంద్రమంత్రి సుజనాకు సుప్రీం కోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. మారిషస్ రుణాల బకాయి చెల్లింపు విషయంలో కింది కోర్టు విధించిన ఆరు నెలల గడువును పెంచాలని హైకోర్టులో ఆయన సంస్థలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గడువు పెంపునకు నిరాకరించిన హైకోర్టు సుజనాకు షాకిస్తూ ఆరు నెలల గడువును మరో నెల కుదిస్తూ ఐదు నెలల గడువునే విధించింది.
హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుజనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గడువు పెంచాలన్న తన అభ్యర్థనను మన్నించకపోగా.. గడువును కుదించడమేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు తీర్పు సరైనదేనని పరోక్షంగా చెప్పిన సుప్రీం ధర్మాసనం సుజనా పిటిషన్ను కొట్టేసింది.
రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగివ్వాలి: బొత్స రివర్స్ ఎటాక్
రాజధాని రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. టిడిపి నేతలు భూములు కొనలేదని చెప్పడం విడ్డూరమన్నారు.
టిడిపి నేతలు భూములు కొంటే తప్పేమిటని అడుగుతున్నారని, అలాంటప్పుడు రైతుల నుంచి భూములు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. టిడిపి నేతలు రాజధాని ప్రాంతంలోనే భూములు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. వేరేచోట ఎందుకు కొనలేదన్నారు.
కొందరు టిడిపి నేతలు భూములు కొంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారని.. మరి రైతుల వద్దనే ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా భూములు ఉన్నాయని టిడిపి నేతలు చెప్పడం విడ్డూరమన్నారు.
తమ పార్టీ నేతలకు భూములు ఉంటే, చంద్రబాబుతో కుమ్మక్కై రైతుల నుంచి భూములు కొంటే అది కూడా తప్పేనని చెప్పారు. తాము అమరావతికి లేదా రాజధానికి వ్యతిరేకం కాదన్నారు. అయితే రాజధాని ముసుగులో చేసే భూదందాకు తాము వ్యతిరేకమని చెప్పారు.
నేను నిజాయితీపరుడినని చంద్రబాబు చెబుతున్నారని, విచారణ ద్వారా ఈ భూదందాను నిరూపించుకోవాలని సవాల్ చేశారు. దీనిపై సిబిఐ విచారణ చేయించాలన్నారు. చంద్రబాబు, టిడిపి నేతలు
చంద్రబాబు పని అయిపోయిందని బొత్స అన్నారు. తేలు కుట్టిన దొంగలా సీఎం బేలగా మాట్లాడుతున్నారన్నారు. భూదందాకు సమాధానం చెప్పకపోగా... పైగా భూములు కొంటే తప్పేమిటని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ అల్లుడో లేక లోకేష్ తండ్రో కాదని.. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయం ఆయన గుర్తుంచుకోవాలన్నారు. రాజధాని భూముల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దానికి సమాధానం చెప్పాలన్నారు. మేం వ్యాపారాలను ప్రశ్నిస్తలేమని, లూటీని ప్రశ్నిస్తున్నామన్నారు.