ఓటుకు నోటు కేసుతో బాబుకు సంబంధం లేదు: వర్ల, వెలగపూడిపై విజయసాయి ఫైర్
అమరావతి: ఓటుకు నోటు కేసులో తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య బుధవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేసిన కేసుపై చంద్రబాబు విచారణ చెల్లదని హైకోర్టు చెప్పిందని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్టర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కేసు లేదన్నారు. దళితుల సొమ్ముతో పులివెందులలో రోడ్లు వేయించుకున్న చరిత్ర వారిది అన్నారు. అంబేడ్కర్ విగ్రహంపై వైసీపీ దళిత నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు.
టీడీపీ నేతలపై విజయసాయి ఆగ్రహం
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి విశాఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగే ప్రతి భూదందా వెనుక వెలగపూడి హస్తం ఉందని ఆరోపించారు. జిల్లాలోని పలు సమస్యలపై ఆయన ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అందుకోసం వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు.